వైసీపీని బొత్స ఇరకాటంలోకి నెట్టారా ? జగన్ నిర్ణయంపై ఉత్కంఠ.. !
ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి, అసెంబ్లీని జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు బాయ్ కాట్ చేసేసిన నేపథ్యంలో మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణే అసెంబ్లీ సమావేశాల్ని లీడ్ చేస్తున్నారు. గతంలో మంత్రిగా, ఎంపీగా చేసిన అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ వైపే ఇప్పుడు వైసీపీ చూస్తోంది. ఇలాంటి కీలక సమయంలో ఆయన నిన్న మండలిలో ఏపీ రాజధానిపై చేసిన వ్యాఖ్యలు మాత్రం పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి.
గతంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు తమ పార్టీ దీనిపై పునరాలోచన చేస్తుందని బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన అధికార కూటమిలో సంతోషం నింపగా.. ఆయన సొంత పార్టీలో మాత్రం అసంతృప్తి రేపినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ రాజధానులపై ఎప్పుడూ మాట్లాడలేదు. అలాగే తమ పార్టీ విధానమైన మూడు రాజధానుల నుంచి వెనక్కి తగ్గినట్లు కానీ, కొనసాగిస్తున్నట్లు కానీ ఎప్పుడూ చెప్పలేదు. పూర్తిగా మౌనాన్నే అశ్రయిస్తోంది. ఇలాంటి సమయంలో బొత్స చేసిన వ్యాఖ్యలు పార్టీలో కాకరేపాయి.

వైసీపీ హయాంలో మూడు రాజధానుల విధానాన్ని తెరపైకి తెచ్చినా అమరావతి రైతులతో పాటు కూటమి పార్టీల వ్యతిరేకతతో న్యాయవివాదాలు తలెత్తాయి. అవి ఇప్పటికీ కోర్టుల్లో పెండింగ్ లోనే ఉన్నాయి. ఆలోపు ఎన్నికలు జరగడం, అమరావతి రాజధానికి మద్దతుగా నిలిచిన కూటమి పార్టీలకు ప్రజలు ఎన్నికల్లో అనుకూల తీర్పు ఇవ్వడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నిర్ణయానికి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో సైలెంట్ అయిపోయిన వైసీపీ.. వచ్చే ఎన్నికల నాటికి దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని భావించింది. కానీ బొత్స ఇప్పుడు సందర్భం లేకపోయినా తేనెతుట్టె కదిపారన్న చర్చ జరుగుతోంది.
మండలిలో బొత్స వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు జగన్ తమ పార్టీ వైసీపీ తరఫున రాజధానుల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. మూడు రాజధానుల విధానం మారలేదని చెబితే ప్రజా తీర్పుకు వ్యతిరేకమన్న ప్రచారం ఖాయం. అలాగని అమరావతిని సమర్దిస్తే కూటమి పార్టీల విధానం కరెక్టే అని ఒప్పుకున్నట్లు అవుతుంది. దీంతో జగన్ రాజధానుల విషయంలో వైసీపీ విధానంపై ఏ నిర్ణయం ప్రకటిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications