'జైలు తప్పదు, రూ.46 కోట్ల శశికళ దారిలో రూ.46వేల కోట్ల వైయస్ జగన్'
అమరావతి: తమిళనాడులోని చిన్నమ్మ శశికళ, బీహార్లోని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్లాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి పత్తిపాటి పుల్లారావు గురువారం మండిపడ్డారు.
ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని చిలకలూరిపేటలోని పాత పశువుల సంత వద్ద ఏర్పాటు చేసిన జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన, ఆవుల అందాల పోటీలను మంత్రి ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ తెలుగువారి ఆరాధ్యదైవం
ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడారు. ఒంగోలు జాతి పశు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగువారి ఆరాధ్య దైవం అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా గత మూడేళ్లుగా చిలకలూరిపేటలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.

శశికళ, లాలూ బాటలో జగన్
జగన్ పాదయాత్రలో ఇస్తున్న హామీలను ప్రజలు నమ్మడం లేదని పత్తిపాటి అన్నారు. అందుకే ప్రజలు పాదయాత్రకు రావడం లేదని చెప్పారు. జగన్ ఇస్తున్న హామీలు అమలు సాధ్యం కావన్నారు. 46 కోట్ల స్కాంలో శశికళ, 100 కోట్ల స్కాంలో లాలూ ప్రసాద్ ప్రస్తుతం జైలులో ఉన్నారని, రూ.46వేల కోట్ల స్కామ్కు పాల్పడిన జగన్ వారి బాటలోనే జైలుకెళ్తారన్నారు.

కులవృత్తులకు తీరని అన్యాయం
కాగా, జగన్ ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. కుల రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు ఎంతో దిట్ట అని, కులవృత్తులకు తీరని అన్యాయం చేస్తున్నారని జగన్ అంతకుముందు రోజు బీసీల ఆత్మీయ సమ్మేళనంలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కులవృత్తుల వారికి హామీలు గుప్పించి, గెలిచాక వాళ్ల బాగోగులు పట్టించుకోవడం లేదన్నారు.

మేం అధికారంలోకి రాగానే
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్సుమెంట్స్ విధానం ద్వారా ఎందరో పేద విద్యార్థులు చదువుకున్నారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ పథకం సక్రమంగా అమలు కావడం లేదన్నారు. దీంతో పిల్లల చదువు కోసం మధ్య తరగతి కుటుంబాలు అప్పులపాలు అయ్యాయని చెప్పారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఏ పాఠశాలలో చదివిన విద్యార్థులకైనా సంవత్సరానికి రూ.15వేలు ఉపకార వేతనంగా అందిస్తామని, 60 ఏళ్లకే ప్రతి నెలా రూ.2వేలు పింఛను అందిస్తామన్నారు.












Click it and Unblock the Notifications