వైసీపీ కృష్ణా జిల్లా నేతలకు పీకే షాక్: నలుగురు ఇంచార్జీల మార్పు?
విజయవాడ: ప్రశాంత్కిషోర్ బృందం నిర్వహిస్తున్న సర్వేలతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు, ఇంచార్జీల మార్పులను చేయనుంది వైసీపీ. కృష్ణా జిల్లాలో నలుగురు ఇంచార్జీలను మార్చాలని వైసీపీ నాయకత్వానికి ప్రశాంత్కిషోర్ బృందం సూచించినట్టు సమాచారం.
2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్కిషోర్ను నియమించుకొంది వైసీపీ. ఈ మేరకు ప్రశాంత్కిషోర్ నివేదికల ఆధారంగా వైసీపీ నాయకత్వం భవిష్యత్ కార్యాచరణను సిద్దం చేస్తోంది.
జగన్కు షాక్: 6గురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి?
కాకినాడ, నంద్యాల ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నాయకత్వానికి ప్రశాంత్కిషోర్ పార్టీ పరిస్థితిపై నివేదికను సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది.
అయితే వైసీపీ చీఫ్ జగన్ ఈ ఏడాది అక్టోబర్లో పాదయాత్ర ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ పాదయాత్ర ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు టిడిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది.

కృష్ణా జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఇంచార్జీల మార్పు
కృష్ణా జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంచార్జీలను మార్చాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్కు ప్రశాంత్ కిషోర్ టీమ్ సూచించినట్టు సమాచారం. ఇటీవల కాలంలో జిల్లాల వారీగా ప్రశాంత్కిషోర్ బృందం సర్వేలు నిర్వహించింది.క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై నివేదికల ఆధారంగా ఈ మేరకు ప్రశాంత్కిషోర్ బృందం ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ప్రశాంత్కిషోర్ బృందంపై వైసీపీ నేతల అసంతృప్తి
ప్రశాంత్కిషోర్ బృంద సభ్యుల తీరును కొందరు వైసీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి. ప్రైవేట్ సంస్థ తరపున సర్వే నిర్వహిస్తున్నామని ఓ ప్రశ్నావళి ఆధారంగా పీకే బృందం సభ్యులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రశ్నాపత్రంలో సుమారు 16 ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నల ఆధారంగా ప్రజల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు ప్రశాంత్కిషోర్ బృందం.అయితే పీకే బృందం నిర్వహిస్తున్న సర్వే పట్ల వైసీపీ శ్రేణులు సంతృప్తిగా లేరని సమాచారం.

ఫిర్యాదులు చేస్తామంటూ
జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలపై నియోజకవర్గ నాయకులు సభలను నిర్వహించి, పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చేయాలని అధిష్ఠానం తమకు ఆదేశాలు జారీ చేసిందని నియోజకవర్గ ఇన్చార్జులకు పీకే బృంద సభ్యుల నుండి ఫోన్లు వస్తున్నాయి. ఈ సభలు నిర్వహిస్తే తమ పని పూర్తి కానుందని పీకే బృందం అభిప్రాయంతో ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగానే సభల ఏర్పాటుపై నిర్ణయం తీసుకొంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే సభల నిర్వహణపై స్పందించని నేతలపై పీకే బృందం నుండి పలువురు నేతలపై వైసీపీ చీఫ్ జగన్కు ఫిర్యాదులు వెళ్తున్నాయి.

పూర్తి స్థాయి సమాచారం సేకరించాలి
అరకొర సమాచారానికి బదులుగా పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించి అధిష్టానానికి నివేదికను ఇవ్వాలని వైసీపీ నేతలు పీకే బృందాన్ని కోరుతున్నారు. అసమగ్ర సమాచారం కారణంగా పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే పీకే బృందం ఏ రకమైన సమాచారం ఇస్తోందో... ఏ రకమైన తలనొప్పులు వచ్చి పడతాయోననే విషయమై ఆందోళన నెలకొంది వైసీపీ నేతల్లో.












Click it and Unblock the Notifications