జగన్కు షాక్: 6గురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి?
అమరావతి:నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు సన్నద్దమౌతున్నారు. ఈ మేరకు టిడిపి మంత్రులకు , టిడిపి ముఖ్యనాయకులకు వైసీపీ ఎమ్మెల్యేల నుండి ఫోన్లు వస్తున్నాయని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అవసరాలకు అనుగుణంగానే వైసీపీ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవాలనే అభిప్రాయంతో టిడిపి నాయకత్వం ఉందని సమాచారం.
కాకినాడ, నంద్యాల ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. ఈ ఫలితాల తర్వాత కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి టచ్లోకి వచ్చారని సమాచారం. అయితే ఈ విషయమై టిడిపి నాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకొంటుంది.
పాదయాత్రపై డైలమా: జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ తాజా ప్లాన్ ఇదీ
త్వరలోనే టిడిపిలోకి వైసీపీ నుండి వలసలు ప్రారంభం కానున్నాయని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని మంత్రుల పేషీలో జంపింగ్ ఎమ్మెల్యేలపై రహస్య చర్చలు ప్రారంభమయ్యాయి.
2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వలసల విషయంలో వ్యవహరించాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది. అయితే వలసలపై టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడిదే తుది నిర్ణయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రులకు వైసీపీ ఎమ్మెల్యేల నుండి ఫోన్లు
వైసీపీ నుండి టిడిపిలోకి వలసలపై విస్తృతంగా చర్చ సాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీలోని కీలకనేత ఓ మంత్రికి ఇటీవల కాలంలోఓ వైసీపీ ఎమ్మెల్యే నుండి ఫోన్ వచ్చిందని సమాచారం. అయితే తనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడ టిడిపిలోకి వస్తారని ఆ నేత చెప్పారనే ప్రచారం సాగుతోంది. మరో ఉత్తరాంధ్ర మంత్రికి కూడా ఇదే విధమైన ఫోన్ కాల్ వచ్చిందనే ప్రచారం కూడ టిడిపి వర్గాల్లో ఉంది. ఈ విషయాలను మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళారు.
ఎమ్మెల్యేల చేరికపై ఆచితూచి నిర్ణయం
వైసీపీ నుండి టిడిపిలో చేరే ఎమ్మెల్యేల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులు బలహీనంగా ఉన్న చోట మాత్రమే వైసీపీ నుండి వచ్చే ఎమ్మెల్యేలను టిడిపిలోకి ఆహ్వనించాలని టిడిపి నాయకత్వం అభిప్రాయంతో ఉంది. ఆయా నియోజకవర్గాల్లో సమర్ధులైన తెలుగుదేశం నేతలు ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ నుంచి నేతలను ఎందుకు తెచ్చుకోవాలని స్వపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా తీసుకురావటం వలన నియోజకవర్గాల్లో కొత్తా, పాతల మధ్య విభేదాలు ప్రారంభమై అగ్రనాయకత్వానికి తలనొప్పిగా మారుతోందని పార్టీ నేతలు అంటున్నారు.
ఆరుగురు ఎమ్మెల్యేలు వైసీపీ నుండి టిడిపిలోకి చేరేందుకు సిద్దం
వైసీపీ నుండి ఆరుగురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ మేరకు టిడిపి నేతలతో వైసీపీ ఎమ్మెల్యేలు చర్చిస్తున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే వైసీపీ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోనున్నారు. అయితే ఎవరికీ టిడిపిలో చేరేందుకు అవకాశం దక్కనుంది, ఇతరులెవరికీ అవకాశం దక్కదనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
టిడిపి మైండ్గేమ్
కాకినాడ, నంద్యాల ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీనీ మరింత ఆత్మరక్షణలోకి నెట్టేందుకు టిడిపి మైండ్ గేమ్ ప్రారంభించిందనే ప్రచారం కూడ లేకపోలేదు. తమ పార్టీ నుండి ఎవరూ కూడ టిడిపిలో చేరడం లేదని వైసీపీ నేతలంటున్నారు. టిడిపి మైండ్గేమ్ ఆడుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.అయితే వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు ప్రారంభమయ్యాక వాస్తవాలు ఏమిటో తేలుతోందని టిడిపి నేతలంటున్నారు.