చంద్రబాబు త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్ష- కరోనా అని తెలియగానే గంటల్లోనే ట్వీట్
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య వాడీవేడిగా రాజకీయాలు సాగుతున్న వేళ నేతల్లో మానవత్వపు పరిమణాలు కూడా వెదజల్లుతున్నాయి. ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబు పేరెత్తితేనే మండిపడే సీఎం జగన్ .. ఇవాళ ఆయనకు కరోనా సోకిందని తెలియగానే స్పందించారు.
ఈ ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు. ఇందులో తనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, తనను కలిసిన వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. తాను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని కూడా తెలిపారు. ఇప్పటికే ఆయన కుమారుడు లోకేష్ కూడా కరోనా పాజివిట్ గా నిర్ధారణ అయ్యారు. దీంతోపాటు పలువురు టీడీపీ నేతలు కూడా కరోనా బారిన పడ్డారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పాటు లోకేష్, ఇతర టీడీపీ నేతలకు వరుసగా పరామర్శల ట్వీట్లు, సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో సీఎం జగన్ కూడా స్పందించారు. చంద్రబాబును ఉద్దేశించి ఆయన ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
చంద్రబాబు త్వరగా కోవాలని, ఆయనకు మంచి ఆరోగ్యం ప్రాప్తించాలని సీఎం జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. @ncbn గారు అంటూ జగన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాజకీయాల్లో ఎన్ని స్పర్ధలు ఉన్నా ప్రత్యర్ధి పార్టీ అధినేత అనారోగ్యం పాలయ్యారని తెలియగానే జగన్ స్పందించడం, ఆయన వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించడంపై పలువురు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఏడాది పొడవునా ఎన్ని రాజకీయాలున్నా... కష్టకాలంలో ప్రత్యర్ధిపై కరుణ చూపడం ద్వారా జగన్ రాజకీయంగా పరిణితి చూపారనే ప్రశంసలు కూడా వస్తున్నాయి. దీంతో జగన్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.