సాయిరెడ్డి నిర్ణయం వెనుక జగన్ ? బీజీపీ కోసం- షర్మిల షాకింగ్ ..!
వైసీపీలో కీలక నేతగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల్ని వీడి వెళ్లిపోవడం మామూలు విషయం కాదని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. సాయిరెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయంపై ఆమె ఇవాళ విజయవాడలో స్పందించారు. సాయిరెడ్డి నిర్ణయం వెనుక జగన్ ఉన్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు గతంలో ఏం జరిగిందో కూడా వెల్లడించారు.
విజయసాయి రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడని షర్మిల తెలిపారు. జగన్ ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయడం, ఎవరిని తిట్టమంటే వాళ్ళను తిట్టడం సాయి రెడ్డి పని అన్నారు. రాజకీయంగా కాదు, వ్యక్తిగతంగా కూడా తన బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయిరెడ్డి అని షర్మిల ఆరోపించారు. ఏ అబద్ధాలు జగన్ చెప్తే సాయి రెడ్డి చెప్పాడన్నారు.
ఇలాంటి జగన్ సన్నిహితుడు రాజీనామా చేశాడు అంటే చిన్న విషయం కాదన్నారు.

వైసీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు దీనిపై ఆలోచన చేయాలని షర్మిల కోరారు. జగన్ ను విజయసాయి రెడ్డి వదిలేశారంటే ఎందుకని వారిని ప్రశ్నించారు. సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు వెళ్తున్నారని అడిగారు. ప్రాణం పెట్టిన వాళ్ళు ఎందుకు జగన్ ను వీడుతున్నారని ప్రశ్నించారు. జగన్ నాయకుడుగా విశ్వసనీయత కోల్పోయారని, నాయకుడుగా ప్రజలను, నమ్ముకున్న వాళ్ళను మోసం చేశారన్నారు. నా అనుకున్న వాళ్ళను కాపాడుకోలేక పోతున్నాడన్నారు.
జగన్ బీజేపీ కి దత్త పుత్రుడని, తనను తాను కాపాడుకోవడానికి సాయి రెడ్డిని బీజేపీ కి పంపాడని షర్మిల ఆరోపించారు. ఇన్నాళ్లు సాయిరెడ్డిని పక్కన పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని, జగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టే సాయిరెడ్డి వెళ్ళిపోయాడని షర్మిల విమర్శించారు. సాయి రెడ్డి బయటకు వచ్చాడని, ఇప్పటికైనా నిజాలు చెప్పాలన్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలు అని మీకు తెలుసు అన్నారు. వివేకా హత్య విషయంలో నిజం చెప్పినందుకు సంతోషం అన్నారు.
మిగతా విషయాలు కూడా బయటపెట్టాలని ఆయన్ను కోరారు.












Click it and Unblock the Notifications