ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది : షర్మిల ఎమోషనల్-అన్నతో అక్కడ కలిసినా...!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్దంతి. సీఎం జగన్ - షర్మిల మధ్య కొంత కాలంగా గ్యాప్ వచ్చింది. ఇద్దరూ కలిసి ఈ గ్యాప్ లో ఎక్కడా ఒకే వేదిక మీదకు రాలేదు. దీంతో..ఈ రోజు అయినా ఇద్దరూ కలిసి తండ్రికి నివాళి అర్పిస్తారా లేదా అనే ఆసక్తి నెలకొని ఉంది. అయితే, సీఎం జగన్ - షర్మిల-విజయమ్మ-భారతి..ఇలా కుటుంబ సభ్యులంతా ఒకే సారి వైఎస్సార్ ఘాట్ కు వచ్చారు. కలిసి నివాళి అర్పించారు. అక్కడ జరిగిన ప్రార్ధనల్లో పాల్గొన్నారు. కానీ, జగన్ - షర్మిల ఒకరిని ఒకరు పలకరించుకున్న సందర్భం అయితే కనిపించ లేదు.

నాటి ఆత్మీయతకు దూరంగా..
విజయమ్మ సైతం ముభావంగానే కనిపించారు. నాటి ఆత్మీయతలు- పలకరింపు లు-ఆలింగనాలు అసలే లేవు. వైఎస్ చెల్లెళ్లు మాత్రం దగ్గరకు వచ్చి జగన్ ను పలకరించారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, మామ రవీంద్ర నాధ్ రెడ్డి, చెవిరెడ్డి నివాళి అర్పించే సమయంలో జగన్ పక్కనే ఉన్నారు జగన్- షర్మిల పక్క పక్కనే కూర్చున్నా పలకరించుకోలేదు. కార్యక్రమం ముగిసిన తరువాత ఎవరికి వారు తమను పలకిరించిన వారితో కలిసి..మాట్లాడుకుంటూ వెళ్లిపోవటం కనిపించింది.
షర్మిల ఎమోషనల్ ట్వీట్..
అయితే, ఈ నివాళి కార్యక్రమం ముగుస్తూనే.. షర్మిల ఒక ట్వీట్ చేసారు. అందులో ఎమోషనల్ అయ్యారు. 'ఒంటరి దానినైనా విజయం సాధించాలని.. అవమానాలెదురైనా ఎదురీదాలని.. కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని.. ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్ & మిస్ యూ డాడీ' అని షర్మిల ట్వీట్ చేశారు. అంటే.. తాను ఒంటరిగా ఫీలవుతున్నాననే విషయాన్ని ఈ ట్వీట్ రూపంలో వైఎస్ షర్మిల చెప్పకనే చెప్పారు.

ఒకే చోట..కానీ గ్యాప్ కంటిన్యూ..
ఇవాళ్టితో ఇద్దరి మధ్య ఉన్న విబేధాలకు ఫుల్స్టాప్ పడుతుందని.. కచ్చితంగా ఇద్దరూ మాట్లాడుకుంటారని.. ఇన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందని అభిమానులు, వైఎస్ అనుచరులు అనుకున్నప్పటికీ.. అవేమీ అస్సలు జరగలేదు. ప్రతీ ఏటా రాఖీ పండుగ నాడు జగన్ - షర్మిల సెలబ్రేషన్స్ అందిరనీ ఆకట్టుకొనేవి. కానీ, ఈ ఏడాది కేవలం షర్మిల తన ట్వీట్ తో అన్నకు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదనే జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడ షర్మిల పార్టీ ఏర్పాటు చేయటం జగన్ కు ఇష్టం లేదు.

ఇద్దరి రూటు సపరేటు..
అదే విధంగా తెలంగాణ ప్రయోజనాల కోసం తాను పోరాడతానని చెప్పటం ఒక విధంగా..జగన్ ను ఢిఫెన్స్ లో పడేసారు. దీంతో.. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతానని షర్మిల చెబుతున్న సమయంలో జగన్ రాజకీయంగా ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే షర్మిలకు దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. వైఎస్సార్ జన్మదినం నాడు అసలు షర్మిల ఉన్న సమయంలో ఘాట్ వద్దకు వెళ్లటానికి కూడా జగన్ సంశయించారు. ఈ రోజున వెళ్లినా... దూరంగానే వ్యవహరించారు.
జగన్ సైతం తండ్రిని గుర్తు చేసుకుంటూ..
ఇక, ఇదే సమయంతో తన తండ్రికి నివాళి అర్పిస్తూ సీఎం జగన్ సైతం ట్వీట్ చేసారు. 'నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది' అని వైఎస్ జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు. షర్మిల చేసిన ఎమోషనల్ ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications