షర్మిల దూకుడుతో జగన్ కు ఇరకాటం-చెల్లెల్ని గెలిపించే యత్నంలో- జరిగేది ఇదేనా ?
తెలంగాణలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వైఎస్ షర్మిల... ఏపీలో తన అన్న వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. అన్న జగన్ ప్రోత్సాహంతోనే తెలంగాణలో పార్టీ పెట్టారన్న విమర్శల నేపథ్యంలో తన చిత్త శుద్ధిని చాటుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ-తెలంగాణ వాటర్ వార్ కు సంబంధించి తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. దీంతో షర్మిల భవిష్యత్ పోరు జగన్ కు సమస్యలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
జగన్, కేసీఆర్ పై షర్మిల కామెంట్స్
తెలంగాణలో వైఎస్సార్టీపీని స్ధాపించి రాజకీయ రంగ ప్రవేశం చేసిన వైఎస్ షర్మిలకు వచ్చీ రాగానే ఏపీతో వాటర్ వార్ రూపంలో పెను సవాల్ ఎదురైంది.. అసలే సమైక్యాంధ్ర ముద్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన షర్మిలకు తెలంగాణలో ఆదరణ దక్కుతుందా లేదా అన్న అనుమానాల మధ్య రాజకీయాల్లోకి ఆమె అడుగుపెట్టారు. ఇదే సమయంలో ఏపీ-తెలంగాణ మధ్య నీటిపారుదల ప్రాజెక్టులపై యుద్దం మొదలైంది. దీంతో కేసీఆర్, జగన్ పరస్పరం ఇళ్లకు వెళ్లి భోజనాలు చేసుకుంటారు కానీ ప్రాజెక్టు వార్ పై రెండు నిమిషాలు మాట్లాడుకోలేరా అంటూ షర్మిల సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణలో చిత్తశుద్ధి చాటుకునే యత్నం
సమైక్యాంధ్ర ముద్ర కలిగిన వైఎస్ కుటుంబం నుంచి వచ్చిన షర్మిలకు ఇప్పుడు తెలంగాణలో తన చిత్తశుద్ధిని చాటు కోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలంతా ఆమె రాజకీయానికి తమకూ ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే చెప్పుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అదే సమయంలో వైసీపీతో తనకూ ఎలాంటి సంబంధం లేదని చాటుకునే ప్రయత్నంలో షర్మిల కూడా ఉన్నారు. ఇదే క్రమంలో పొరుగు రాష్ట్ర సీఎం అయిన అన్న జగన్ పైనే ఆమె నేరుగా విమర్శలు ఎక్కుపెట్టాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.
జగన్ ను ఎంత టార్గెట్ చేస్తే అంత పాపులర్
వైఎస్ షర్మిలకు ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు మరో రెండేళ్ల సమయం ఉంది. ఈ లోగా తనపై ఉన్న వైఎస్ కుటుంబం సమైక్యాంధ్ర ముద్రను తొలగించుకుంటూ, మరోవైపు తన తండ్రి వైఎస్సార్ వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో తెలంగాణ ప్రాజెక్టుల్ని టార్గెట్ చేస్తున్న తన అన్న వైఎస్ జగన్ ను కౌంటర్ చేయాల్సిన పరిస్ధితి షర్మిలది. ఈ ప్రయత్నంలో షర్మిల ఎంత సక్సెస్ అయితే అంత ప్రజాదరణ దక్కడం ఖాయం. దీంతో షర్మిల పార్టీ జెండా ఆవిష్కరణ రోజే అన్న జగన్ తో పాటు ఆయన మాజీ ఫ్రెండ్, ప్రస్తుతం కత్తులు దూస్తున్న కేసీఆర్ ను కూడా ఆమె టార్గెట్ చేస్తున్నారు.
Recommended Video
షర్మిల టార్గెట్ తో జగన్ కు ఇక్కట్లు
తెలంగాణలో తన చిత్తశుద్ధిని చాటుకునే ప్రయత్నంలో వైఎస్ షర్మిల.. అన్న వైఎస్ జగన్ పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలోకి వచ్చిన షర్మిల.. ఇప్పుడు ఆ బాణాన్ని అన్నపైనే ఎక్కుపెట్టాల్సిన పరిస్ధితి నెలకొంది. దీంతో ఆమె మొహమాటాలకు పోకుండా జగన్ పై పోరుకు సిద్దమవుతున్నారు. అయితే ఇది అంతిమంగా వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్ధితి తెచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి షర్మిల విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై వైసీపీ మంత్రులు, నేతలకు జగనా్ దిశానిర్దే్శం చేస్తున్నారు. కానీ భవిష్యత్తులో షర్మిల విమర్శలు తీవ్రమైతే అప్పుడు దానికి కౌంటర్ ఇచ్చుకోక తప్పని పరిస్ధితి వైసీపీకి ఎదురవుతుంది. ఇదే అదనుగా ఏపీలో విపక్షాలు సైతం షర్మిలపై విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్దోంది.