సమైక్యరాష్ట్రంలోనే: విజయమ్మ వ్యాఖ్య, డిగ్గీపై టిడిపి ఫైర్
హైదరాబాద్: 2014 సార్వత్రిక ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ గురువారం అన్నారు. ఆర్టికల్ 3ని మొదటి నుండి తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఆర్టికల్ 3 ప్రకారం విభజన అంటే ఓ ప్రాంతానికి అన్యాయం చేయడమని కాదన్నారు. రాష్ట్ర విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడులే కారణమన్నారు.
డిగ్గీపై మండిపాటు
బిల్లు పైన ఓటింగ్ జరగదేలని, ముఖ్యమంత్రి పెట్టిన తీర్మానం పైనే ఓటింగ్ జరిగిందన్న ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పైన సీమాంధ్ర నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ఎలా పెడతారని మంత్రి గంటా శ్రీనివాస్ రావు ప్రశ్నించారు.
స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడారని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ చెబుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మొదటి నుండి డ్రామాలు ఆడినా చివరకు కలిసి వచ్చిందన్నారు. డిగ్గీ రాష్ట్రానికి రావణాసురిడిలా తయారయ్యాడని దుయ్యబట్టారు. తాము త్వరలో ఢిల్లీకి వెళ్లి పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సహకరించవద్దని జాతీయ పార్టీల నేతలను కోరుతామన్నారు.
రాష్ట్రపతి జేబులోని వ్యక్తిగా డిగ్గీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ బిల్లుపై కేంద్రానికి వ్యతిరేకంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సుప్రీం కోర్టులో సూట్ దాఖలు చేయాలని సూచించారు. బిల్లు పైన తీర్మానం లేదా ఓటింగ్ కోరలేదని, ఓటింగ్ జరిగే పరిస్థితి లేదని ఆ కారణంగానే మూజువాణి ఓటింగుతో సభాపతి ఆమోదించారన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకోవాల్సింది కేంద్రమంత్రులు, ఎంపీలే అన్నారు.