తలపొగరెక్కి: అంబటి, కేంద్రం నిధులు వద్దనేనా: బాబు స్విస్ ఛాలెంజ్పై అనుమానం
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తలపొగరెక్కి, ఎవరినైనా అణిచివేయాలని చూస్తున్నారన్నారు.
ప్రజాస్వామ్యంలో అది సరికాదన్నారు. కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమాత్రం సరికాదన్నారు. అది సిగ్గుచేటు అన్నారు. ముద్రగడ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ముద్రగడకు అండగా ఉంటామన్నారు.
స్విస్ ఛాలెంజ్ పద్ధతిపై పార్థసారథి
అమరావతి నిర్మాణం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నిర్మిస్తామని చెప్పడంపై వైసిపి నేత పార్థసారథి స్పందించారు. తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కానీ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సమాచార లోపముందన్నారు. రాజధాని నిర్మాణం కొన్ని తరాలకు ఉపయోగపడేదని, అందరికీ ఆమోదయోగ్య రాజధాని కావాలన్నారు.
చంద్రబాబు జేబు సంస్థలకే కాంట్రాక్టులు లభించాయని మండిపడ్డారు. పునర్విభజన సమయంలో ఏపీకి కొన్ని హక్కులు ఇచ్చారని, దీనిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
రాజధానికి కేంద్రం నుంచి నిధులు వద్దనే ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం పైన చంద్రబాబుకు గౌరవం లేదన్నారు. మీడియా ద్వారానైనా రాజధాని నిర్మాణానికి చెందిన వాస్తవాలను ప్రజలకు చెప్పాలన్నారు.