కాంగ్ నేతల భార్యల బృందంలో జగన్ పార్టీ నేతల వైఫ్స్
న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు, కేంద్రమంత్రులు సతీమణుల బృందంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల భార్యలు కూడా ఉన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్లను శనివారం కలిసిన విషయం తెలిసిందే.
ఈ బృందంలో బృందంలో కావూరి హేమలత, కోట్ల సుజాతమ్మ, తోట వాణి, కె.కమల, పితాని అనంత లక్ష్మి, కన్నా విజయ, శత్రుచర్ల శశికళ, సాకె మోక్ష ప్రసూన, కోండ్రు శ్రీలక్ష్మి, పినిపె మీనాక్షి, ఎమ్మెల్యే శేషారెడ్డి భార్య రాజ్యలక్ష్మి, రుద్రరాజు ఇందిర, ఆనం రామనారాయణ రెడ్డి సోదరి సుచరిత, ఎమ్మెల్యే కె నాగేశ్వరరావు భార్య లక్ష్మి, వేదవ్యాస్ భార్య విజయ, శివ రామిరెడ్డి భార్య ఉమాదేవి, తిప్పేస్వామి భార్య సిద్ధ గంగమ్మ, మధుసూదన్ భార్య అపర్ణ, మాజీ మంత్రి చెంగారెడ్డి భార్య ఇందిర, గాదె వెంకటరెడ్డి కోడలు శ్రీదేవి తదితరులున్నారు.
వీరితో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల సతీమణులు కూడా ఈ బృందంతో కలిసి కాంగ్రెస్ పెద్దలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బృందంలో ప్రభుత్వ మాజీ సలహాదారు సోమయాజులు భార్య కల్యాణి, మారెప్ప భార్య వేదమణి, ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి భార్య మంజీర, సామినేని ఉదయ భాను భార్య విమల, బాలశౌరి భార్య భాను, బాలినేని శ్రీనివాసులు రెడ్డి భార్య శచీదేవి ఉన్నారు. వీరు అందరితోపాటు నాయకులను కలవడమే కాకుండా ఒకే వినతి పత్రంపై సంతకాలు కూడా చేశారట.
కాగా, సిడబ్ల్యూసి నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లలేమని తనను కలిసిన మహిళా బృందానికి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇరు ప్రాంతాల ప్రజలూ కాంగ్రెస్కు కావాలని దిగ్విజయ్ తమతో అన్నారని బృందంలోని మహిళలు మీడియాకు చెప్పారు. వీలైనంత మేరకు ఇరు ప్రాంతాలకూ అన్యాయం జరగకుండా, సమ న్యాయం చేస్తామని దిగ్విజయ్ హామీ ఇచ్చారట.