వానపాములాంటి లోకేష్ నాగుపాములా బుసకొడుతున్నాడు: రోజా
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా తీవ్రంగా ధ్వజమెత్తారు. తండ్రికి అధికారం ఉందని వానపాములాంటి నారా లోకేష్ నాగుపాములా బుసకొడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
నారా లోకేష్ అవాకులు, చవాకుల వల్లనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిందని, టిడిపిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో విలీనం చేసే పరిస్థితి వచ్చిందని ఆమె బుధవారం మీడియాతో అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి వస్తుందని టిడిపి నాయకులు భయపడుతున్నారని ఆమె అన్నారు.
నమ్మినవారిని నట్టేట ముంచే సిద్ధాంతం నారావారిదని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ను దెబ్బ కొట్టాలనే ఆలోచన తప్ప చంద్రబాబుకు పాలనపై శ్రద్ధ లేదని అన్నారు. చంద్రబాబులా దిక్కుమాలిన ఆలోచనలు చేయాల్సిన అవసరం జగన్కు లేదని ఆమె అన్నారు.
నైతికత ఉంటే చంద్రబాబు టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ఆమె సవాల్ చేశారు. అప్పుడు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమిటో తేలుతుందని ఆమె అన్నారు. పార్టీ కోసం ప్రాణాలు వదిలినవారిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆమె వ్యాఖ్యానించారు. మొన్నటికి మొన్న ప్రజలకు వెన్నుపోట్లు పొడిచారని ఆమె అన్నారు.