జగన్కు అర్హత లేదన్న లోకేష్, చిచ్చుపై రంగంలోకి..
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ సోమవారం మండిపడ్డారు. జగన్ది దొంగల పార్టీ అని విమర్శించారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ సాధ్యం కాదన్న వైయస్సార్ కాంగ్రసె్ పార్టీ నేతలు ఇప్పుడు రుణమాఫీ చేయమంటూ ధర్నాలు చేయడం విడ్డూరమన్నారు.
రుణమాఫీ పైన ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ిచ్చిన హామీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారన్నారు. 50 రోజుల్లో 50 లక్షల సభ్యత్వాలను నమోదు చేసి తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డు నెలకొల్పిందన్నారు.
అంతకుముందు హైదరాబాదు నుండి బయలుదేరిన నారా లోకేష్.. సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా లోకేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
కేశినేని నాని, దేవినేని రగడపై లోకేష్ రంగంలోకి దిగారా?
కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమామహేశ్వ రావు, ఎంపీ కేశినేని నానిల మధ్య విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా లోకేష్ రంగంలోకి దిగి ఉంటారని అంటున్నారు. తెలుగు తమ్ముళ్లను సమన్వయం చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తారని చెబుతున్నారు.