హోం మంత్రి నియోజకవర్గంలో వైసీపీ విధ్వంసం: టీడీపీ మహిళా నేత ఇంటిపై దాడి, ఆరు బైక్ లు దగ్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాలు, అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ మహిళా నేత మాజీ జడ్పిటిసి బత్తిని శారద ఇంటిపై వైసిపి కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. వైసీపీ కార్యకర్తల తీరుపై, వైసీపీ దాడులపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు . అంతేకాదు ఇంట్లో ఉన్న సామాగ్రిని ధ్వంసం చేసి ఆరు ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టి, ఇంటికి నిప్పంటించారు అని బాధితులు మండిపడుతున్నారు. పోలీసుల ముందే ఈ సంఘటన జరిగినా పోలీసులు పట్టించుకోకపోవడంపై బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
కొప్పర్రులో వైసీపీ కార్యకర్తల వీరంగం.. టీడీపీ మహిళా నేత ఇంటిపై దాడి
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు లో వైసిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. ఏపీ హోం మంత్రి సొంత నియోజకవర్గంలోనే బీభత్సం సృష్టించారు టిడిపి మాజీ జెడ్పిటిసి శారద ఇంటిపై దాడికి దిగిన వైసిపి కార్యకర్తలు వీరంగం వేశారు. రాళ్ల దాడి చేయడంతో పాటుగా ఇంటికి నిప్పంటించారు. వైసిపి నేతల దాడితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పక్కా ప్రణాళికతోనే తమ ఇంటిపై దాడి చేశారని, టిడిపి మహిళా నాయకురాలు మాజీ జెడ్పిటిసి సభ్యురాలు శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలకు తమకు ఘర్షణ జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉండి కూడా ప్రేక్షక పాత్ర వహించారని వారు ఆరోపిస్తున్నారు.
ఆరు బైకులు దగ్ధం .. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తం .. పోలీస్ పికెటింగ్
తన భర్త పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అని ప్రజలు తమకు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే దాడులకు పాల్పడుతున్నారని మాజీ జెడ్పిటిసి సభ్యురాలు శారద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఘర్షణ జరిగి, ఆరు బైకులు దగ్ధం చేసిన తర్వాత ఘటనా స్థలికి చేరుకున్న పోలీస్ సిబ్బంది పరిస్థితులను అదుపులోకి తీసుకురావటానికి చర్యలు చేపట్టారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి గ్రామంలో నెలకొంది.
పోలీసుల సమక్షంలో వైసీపీ తాలిబన్ల విధ్వంసకాండ, టీడీపీ ధ్వజం
తాజా పరిణామాలతో టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అధినేతకు, ప్రతిపక్ష పార్టీ నాయకులకు రక్షణ లేదని టెన్షన్ పడుతున్నారు. ఇక తాజాగా టిడిపి మహిళా నాయకురాలు ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా దాడికి సంబంధించిన దృశ్యాలను షేర్ చేసిన టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోం మంత్రి సొంత నియోజకవర్గంలో పోలీసుల సమక్షంలో వైసీపీ తాలిబన్ల విధ్వంసకాండ కొనసాగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో దిగజారిన శాంతిభద్రతలకు ఇదే నిదర్శనమని చెప్తున్నారు.
Recommended Video
రెండు చోట్ల దౌర్జన్య కాండ.. రాష్ట్రంలో తాజా పరిస్థితిపై టీడీపీ ఆగ్రహం
కొప్పర్రు గ్రామంలో మాజీ జెడ్పిటిసి ఇంటిపై దాడి చేయడమే కాకుండా, మరోచోట మాజీ ఎంపిటిసి వేణు ఇంట్లో చొరబడి అడ్డం వచ్చిన వారిని చితకబాది ఫర్నీచర్ ను ధ్వంసం చేశారని పేర్కొంటూ రెండు ప్రాంతాలలో ప్రజలను బెంబేలెత్తించిన ఈ దౌర్జన్యకాండలు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం, పెదనందిపాడు మండలంలో జరిగాయని టిడిపి వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు ఇది అద్దం పడుతుందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. వైసిపి సర్కారు తీరును ఎండగడుతోంది.