పరారీలో రఘురామ- సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రధానికి ఫిర్యాదు- వైసీపీ అడ్వకేట్ లేఖలు
ఏపీలో వైసీపీకీ, ఆ పార్టీ తరఫున గెలిచి రెబెల్గా ఎంపీ మారిన రఘురామకృష్ణంరాజుకీ మధ్య యుద్ధం పతాక స్ధాయికి చేరింది. ఇప్పటికే రోజూ రఘురామరాజు ఏదో ఒక అంశంపై సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ లేఖలు పంపుతుండగా... ఇప్పుడు వైసీపీ నుంచి కౌంటర్ అటాక్ ప్రారంభమైంది. అయితే ఈసారి వైసీపీ రఘురామకు బదులు ఆయనపై ఫిర్యాదు చేస్తూ ఏకంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రధాని, రాష్ట్రపతికి మెయిల్స్ పంపడం సంచలనం రేపుతోంది. ఈ మెయిల్స్ వైసీపీ పేరుతో కాకుండా పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ తన పేరుతో పంపడం విశేషం.
రఘురామపై వైసీపీ కౌంటర్ అటాక్
నిత్యం ఏదో ఒక అంశంపై సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న రెబెల్ ఎంపీ రఘురామరాజుపై వైసీపీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. గతంలో రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ లోక్సభ స్పీకర్కు పదే పదే ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో రూటూ మార్చింది. ఈసారి ఏకంగా రఘురామరాజు పరారయ్యారంటూ కోర్టులకూ, వీఐపీలకు మెయిల్స్ వెళ్లాయి. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. రఘురామరాజుపై వైసీపీ పోరుపై ఓ రకంగా అనుమానాలు కూడా రేకెత్తిస్తోంది.
రఘురామ పరారీపై వైసీపీ అడ్వకేట్ మెయిల్స్
గతంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన రాజద్రోహం కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన రఘురామరాజు దీని కోసం సొంత పూచీకత్తు సమర్పించకుండా ఢిల్లీకి పారిపోయారంటూ వైసీపీ అడ్వకేట్ పంపిన మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. వైసీపీ లీగల్ సెల్ సభ్యుడిగా ఉన్న విజయవాడ న్యాయవాది కోటంరాజు వెంకటేష్ శర్మ రఘురామ పరారీపై సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రధాని, రాష్టపతి, లోక్సభ స్పీకర్తో పాటు మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ వంటి మొత్తం 18 మందికి మెయిల్స్ పంపడం చర్చనీయాంశంగా మారింది.
సొంత పూచీ కత్తు ఇవ్వని రఘురామ
సుప్రీంకోర్టు బెయిల్ షరతుల్లో పేర్కొన్న విధంగా చెరో లక్ష రూపాయల చొప్పన ఇద్దరు సెక్యూరిటీలతో పాటు సొంత పూచీ కత్తు కింద మరో లక్ష రూపాయలకు బాండ్ సమర్పించాల్సి ఉంది. కానీ ఇద్దరు సెక్యూరిటీలు మాత్రమే బాండ్ సమర్పించగా. రఘురామ మాత్రం సొంత పూచీ కత్తు సమర్పించకుండానే సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఢిల్లీ వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని వైసీపీ న్యాయవాది వెంకటేష్ సుప్రీంకోర్టు, హైకోర్టు, వీఐపీల దృష్టికి తీసుకెళ్లారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘనే అని పేర్కొన్నారు.
అలాగే సీఐడీ కోర్టు బెయిల్ పేపర్లపై రఘురామ సంతకాలు తీసుకోవాలని గంటూరు జైలుకు పంపగా.. అక్కడ జైలు సూపరింటెండెంట్ సంతకాలు తీసుకోకుండానే పేపర్లు వెనక్కి పంపారని న్యాయవాది ఫిర్యాదులో తెలిపారు. దీంతో జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు ఈ నెల 25 వరకూ పొడిగించిందని, కానీ రఘురామ మాత్రం పరారీలోనే ఉన్నారని ఆయన ఫిర్యాదు చేశారు.
రఘురామను వదిలేస్తారా?
గుంటూరు సీఐడీ కోర్టు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఇవాళ పూర్తవుతోంది. తిరిగి ఆయన్ను కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. అయినా ఇప్పటికీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేయలేదని వైసీపీ అడ్వకేట్ కోటంరాజు వీఐపీలకు పంపిన లేఖల్లో ఫిర్యాదు చేశారు.
పేదలైన ముద్దాయిలు పరారీలో ఉంటే వెంటనే వారిని అరెస్టు చేసే పోలీసులు, పెద్ద హోదాలో ఉండి పలుకుబడి కలిగిన ఎంపీ రఘురామ వ్యవహారంలో మాత్రం నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రఘురామ బెయిల్ షరతుల మేరకు గుంటూరు జైలుకు కానీ, సీఐడీ కోర్టుకు కానీ వెళ్లి సొంత పూచీకత్తు ఇవ్వాల్సి ఉందని, లేకపోతే పరారీలో ఉన్న నిందితుడిగానే పరిగణించాలని వైసీపీ న్యాయవాది కోటంరాజు తెలిపారు.
రఘురామపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ
గతంలో ఇచ్చిన బెయిల్ షరతుల్ని ఉల్లంఘించిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు వ్యవహారంపై జోక్యం చేసుకని సుమోటోగా విచారణ చేపట్టాలని వైసీపీ న్యాయవాది కోటంరాజు తన ఫిర్యాదులో సుప్రీంకోర్టును కోరారు. బెయిల్ షరతుల ఉల్లంఘనను తీవ్రమైన నేరంగా పరిగణించాలని, భవిష్యత్తుల మరెవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. అలా చేయకపోతే ఈ దేశంలో తమను శిక్షించేందుకు మాత్రమే న్యాయస్ధానాలు ఉన్నాయన్న భావనకు పేదలు వస్తారని ఈ ఫిర్యాదులో తెలిపారు.