కేంద్రంతో కటీఫ్: దేశ రాజకీయాల్లో ప్రతిపక్షంగా వైసీపీ: కేజ్రీవాల్కు బాసటగా జగన్ సర్కార్
అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక దేశ రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించబోతోందా? 21 ప్రతిపక్ష పార్టీలకు సారథ్యాన్ని వహిస్తుందా? కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీతో ఇక ఘర్షణ వైఖరిని అనుసరించబోతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజ్యసభలో వైసీపీ అనుసరిస్తోన్న వ్యూహాలు.. ఈ రకమైన ప్రశ్నలకు కేంద్రబిందువులయ్యాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారమే వైసీపీ.. కేంద్రంతో కటీఫ్ చెప్పడానికి కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్పై
దేశ రాజకీయాల్లో తటస్థంగా ఉంటూ వచ్చిన వైఎస్సార్సీపీ తన వైఖరిని మార్చుకుందనేది స్పష్టమౌతోంది. తటస్థ వైఖరిని విడనాడి.. కేంద్రాన్ని ఢీ కొట్టేలా తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం పట్టువిడుపులను ప్రదర్శిచంకపోవడం.. ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గకపోవడం వంటి పరిణామాలు వైసీపీని పునరాలోచనలోకి నెట్టినట్టయిందని అంటున్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని ఏ మాత్రం సమర్థించినా..రాష్ట్రంలో రాజకీయంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదని భావిస్తోన్న వైసీపీ కేంద్రంతో ఘర్షణ వైఖరే ప్రదర్శించాలని నిర్ణయించుకున్నట్టయింది.

వరుసగా రెండోసారి వాకౌట్..
దేశవ్యాప్తంగా అత్యంత వివాదాస్పదంగా మారిన మూడు వ్యవసాయ బిల్లుల వ్యవహారంలోనూ వైసీపీ కేంద్రాన్ని సమర్థించిన విషయం తెలిసిందే. ఈ బిల్లులకు అనుకూలంగా ఆ పార్టీ సభ్యులు రాజ్యసభలో ఓటు వేశారు. తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ దీన్ని వ్యతిరేకించినప్పటికీ.. పట్టించుకోలేదు. వ్యవసాయ బిల్లులకు అనుకూలంగా వ్యవహరించింది. కేంద్రాన్ని సమర్థించింది. అదే సమయంలో వైసీపీ ఎన్డీఏలో చేరడం ఖాయమని, కేంద్ర కేబినెట్లో చేరుతుందంటూ వార్తలొచ్చాయి. అవేవీ కార్యరూపాన్ని దాల్చలేదు.

కేజ్రీ సర్కార్కు బాసటగా..
తాజాగా వైసీపీ సభ్యులు మరోసారి రాజ్యసభ నుంచి వాకౌట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఎన్డీఏ పట్ల మెతక వైఖరిని అనుసరిస్తూ వచ్చిన ఆ పార్టీ.. దానికి పుల్స్టాప్ పెట్టిందనే అంటున్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ అధికారాలను మరింత కుదిస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్మెంట్) బిల్లు 2021పై చర్చను వైసీపీ సభ్యులు బహిష్కరించారు. సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ వారంరోజుల్లో వైసీపీ కేంద్రం విధానాన్ని తప్పు పడుతూ వాకౌట్ చేయడం ఇది రెండోసారి.

మాట వినట్లేదనే..
దేశంలోనే నాలుగో అతిపెద్ద రాజకీయ పార్టీ వైసీపీ. బీజేపీ, కాంగ్రెస్, వాటి మిత్రపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ తరువాత.. ఆ స్థాయిలో లోక్సభ సభ్యుల బలం ఉన్న ఏకైక పార్టీ ఇదొక్కటే. ఈ స్థాయిలో ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇన్నాళ్లూ మెతక వైఖరినే అనుసరించింది. ఎప్పుడైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కేంద్రం అమ్మకానికి పెట్టిందో.. అప్పటి నుంచే వైసీపీ తన వైఖరిని, విధానాలను మార్చుకునట్టు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను ఏ మాత్రం పట్టించుకోకుండా.. వందశాతం ప్రైవేటీకరణకే మొగ్గు చూపడంతో మాట వినట్లేదని నిర్ణయించుకుంది. అదే సమయంలో ప్రత్యేక హోదాను కూడా ఇవ్వబోమంటూ తేల్చేయడం దీనికి మరో కారణమైంది.












Click it and Unblock the Notifications