హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైసీపీ యత్నం; టీడీపీ ఆఫీస్ లపై దాడులతో ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈరోజు టిడిపి అధికార జాతీయ ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడితో ప్రారంభమైన దాడుల పరంపర తెలుగుదేశం పార్టీ ఆఫీసులకు చేరుకుంది. సీఎం జగన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించడాన్ని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో టిడిపి కార్యాలయాలు, టిడిపి నేతల నివాసాలపై దాడులకు తెగబడుతున్నారు. ఇక బాలకృష్ణ కు నిరసన సెగ తగిలింది.
హిందూపురంలో బాలకృష్ణ ఇంటి ముట్టడి యత్నం
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గత మూడు రోజులుగా హిందూపురంలోనే ఉన్న నేపధ్యంలో బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైసీపీ నేతలు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు బాలకృష్ణ ఇంటి ముందు బైఠాయించి నినాదాలు చేశారు. బాలకృష్ణ కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. పక్కా ప్రణాళికతోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టాభి ఇంటిపై దాడి, దొరికితే చంపేస్తామని వార్నింగ్
పట్టాభి ఇంటిపై దాడికి తెగబడిన వైసీపీ కార్యకర్తలు ఫర్నీచర్మం ధ్వంసం చేశారు. విలువైన వస్తువులను నాశనం చేసారు. పట్టాభి దొరికితే చంపేస్తామని బెదిరించారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కార్యాలయం వద్ద నిలిపి ఉంచిన వాహనాలపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీంతో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి.. జాతీయ రహదారిపై టీడీపీ ఆందోళన
టిడిపి కేంద్ర కార్యాలయం పై వైసిపి నాయకులు దాడి నేపథ్యంలో జాతీయ రహదారిపై టిడిపి శ్రేణులు ఆందోళనకు దిగారు. అటు విశాఖ, తిరుపతి, గుంటూరులోని టిడిపి కార్యాలయాలపైన వైసీపీ శ్రేణుల దాడులు కొనసాగుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు లోను టిడిపికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు టిడిపి నేత లింగారెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షా కు చంద్రబాబు ఫోన్ చేసి తమకు కేంద్ర బలగాల సహాయం కావాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై దాడులపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
Recommended Video
టీడీపీ ఆఫీస్ కు చంద్రబాబు, పట్టాభితో మాట్లాడిన బాబు, దాడులపై ఆగ్రహం
టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత పార్టీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు అక్కడ పరిస్థితి పర్యవేక్షించారు. దాడి జరిగిన తీరును పరిశీలించారు. టీడీపీ నేత పట్టాభితో మాట్లాడారు చంద్రబాబు. టీడీపీ ప్రధాన కార్యాలయానికి టీడీపీ నేతలు చేరుకున్నారు. టీడీపీ నేతలు దేవినేని ఉమ, వర్ల రామయ్య, అశోక్ బాబు, పట్టాభి తదితరులు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ ఆఫీస్ కు కూతవేటు దూరంలో డీజీపీ ఆఫీస్ ఉన్నా ఈ ఘటనపై కాల్ చేస్తే స్పందించలేదని టీడీపీ నేత అశోక్ బాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉందా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ శ్రేణుల దాడులతో రాష్ట్రం మొత్తం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న దాడులపై వైసీపీ నేతలు ఇప్పటివరకు స్పందించలేదు.