నెల్లూరులో వైసీపీ ఆపరేషన్ షురూ - కోటంరెడ్డికి అనూహ్య ట్విస్ట్..!!
నెల్లూరు రూరల్ లో వైసీపీ అధినాయకత్వం ఆపరేషన్ మొదలు పెట్టింది. పార్టీ నేతలు సైతం తాజాగా కోటంరెడ్డికి షాక్ ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సొంత పార్టీ..ప్రభుత్వంపైన వ్యాఖ్యలతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని సీఎం జగన్ నియోకవర్గ ఇంఛార్జ్ గా నియమించారు. వచ్చే ఎన్నికల్లో ఆదాల నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది.
ముఖ్యమంత్రి ఆదేశాలను తాను అమలు చేస్తానని ఆదాల వెల్లడించారు. కానీ, కోటంరెడ్డి మాత్రం ఎన్నికల సమయంలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చూడాలంటూ ఆసక్తి కర వ్యాఖ్య చేసారు. ఇక..నెల్లూరు రూరల్ లో వైసీపీ అధినాయకత్వం ఆపరేషన్ మొదలు పెట్టింది. పార్టీ నేతలు సైతం తాజాగా కోటంరెడ్డికి షాక్ ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా రెండు సార్లు గెలుపొందారు. ఇప్పుడు తన ఫోన్ ట్యాపింగ్ చేసారని..తనను అనుమానించి..అవమానించిన చోట తానుండనని చెబుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయటం లేదని ప్రకటించారు. కోటంరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..వైసీపీ నుంచి పోటీ చేయనున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగారు.
ఇప్పటి వరకు శ్రీధర్ రెడ్డికి మద్దతు దారులుగా ఉన్న పార్టీ నేతలు క్రమేణా ఆయనకు దూరం అవుతున్నారు. కొత్త ఇంఛార్జ్ ఆదాలకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా..ఇద్దరు నెల్లూరు కార్పోరేటర్లు ఆదాలకు మద్దతుగా నిలిచారు. 22,23 డివిజన్ల కార్పోరేటర్లు విజయ్ భాస్కర్ రెడ్డి, గౌరీ ఇద్దరు తాము ఆదాల నాయకత్వంలోనే పని చేస్తామని ముందుకొచ్చారు.
కోటంరెడ్డి తాను టీడీపీలోకి వెళ్తామని చెప్పారని..ఆ పార్టీలోకి తాము వెళ్లలేమని స్పష్టం చేసారు. తాము వైసీపీలోనే ఉంటామని స్పష్టం చేసారు. అదే విధంగా.. నియోజకవర్గంలో వైసీపీ మద్దతు దారులతో ఆదాల త్వరలో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో రీజనల్ ఇంఛార్జ్ బాలినేని నెల్లూరులోనే మకాం వేయనున్నారు.
తమను డామేజ్ చేసే విధంగా కోటంరెడ్డి వ్యవహరించారనేది వైసీపీ ముఖ్య నేతల భావనగా కనిపిస్తోంది. ఈ క్రమంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతీ ఇంటికి వెళ్లాలని ఆదాలకు పార్టీ నాయకత్వం సూచింది. పార్టీ మద్దతు దారుల నుంచి ఆదాల కు పూర్తి స్థాయిలో సపోర్ట్ లభించేలా బాలినేని మంతనాలు ప్రారంభించారు. దీంతో..రానున్న రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.