వైసీపీది విశ్వాసమా, అతి విశ్వాసమా - తేడా కొడుతోంది..!!
ఏపీలో మరోసారి అధికారం ఖాయమని వైసీపీ చెబుతోంది. జగన్ మరోసారి సీఎంగా ప్రమాణం ఖాయమని నమ్మకంతో ఉంది. జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు చేసింది. ఇందు కోసం వైసీపీ నేతలు విశాఖ కు వచ్చేందుకు హోటళ్లు బుక్ చేసుకున్నారు. విమాన, ప్రయివేటు బస్సు ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. అసలు ఫలితాలు రాకుండానే వైసీపీ ఇంతలా ఎందుకు హంగామా చేస్తుంది. ఇది విశ్వసమా..అతి విశ్వాసమా..అసలు ఏంటి వైసీపీ నేతల ధీమా.
ఎన్నికల్లో గెలుపెవరిది
ముఖ్యమంత్రి జగన్ తనకు రెండో సారి అధికారం దక్కినట్లేనని ధీమాగా ఉన్నారు. ఎన్నికల తరువాత ఐప్యాక్ టీంతో సమావేశం సమయంలో 2019 లో వచ్చిన 151 అసెంబ్లీ..22 ఎంపీ సీట్ల కంటే ఎక్కువగా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేసారు. ఆ తరువాత జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 30న తిరిగి రానున్నారు. అయితే, పోలింగ్ సరళి చూసిన తరువాత వైసీపీ శ్రేణుల్లో నిజంగా జగన్ చెప్పినట్లుగా 151 కంటే ఎక్కువ సీట్లు సాధ్యమేనా అనే సందేహాలు మొదలయ్యాయి. జగన్ ప్రచారం కోసం చెప్పే వ్యక్తి కాదని..జగన్ చెప్పే మాటకు విలువ ఉంటుందనేది మరో వాదన. కానీ, సొంత పార్టీ నేతలకే వాస్తవంగా జగన్ ప్రకటన పైన నమ్మకం కుదరటం లేదు.

ప్రమాణ స్వీకారం కోసం
ఇక..బొత్సా..వైవీ సుబ్బారెడ్డి లాంటి నేతలు జగన్ రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకార ముహూర్తం ప్రకటించారు. జూన్ 9న జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఫిక్స్ చేసారు. జగన్ మరోసారి సీఎం కావటం ఖాయమని నమ్ముతున్న వైసీపీ నేతలు ఆ రోజు కోసం విశాఖలో హోటళ్లు బుక్ చేసుకుంటున్నారు. విమానాలు ఆ రోజుకు విశాఖ వచ్చేవి ఫుల్ అయ్యాయి. ప్రయివేటు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ట్రావెల్స్ జూన్ 8, 9 తేదీల్లో విశాఖకు ఛార్జీలను రెట్టింపు చేసాయి. సోషల్ మీడియాలోనూ జగన్ చెప్పిన విధంగానే సీట్లు గెలుస్తామంటూ సర్వే నివేదికలు, అంచనాలను వెల్లడిస్తున్నారు. ఇదే సమయంలో అటు చంద్రబాబు క్యాంపు గెలుపు అంచనాల పైన మౌనం పాటిస్తోంది.
ఫలితాల పై ఉత్కంఠ
వైసీపీ 2019 లో 51 శాతం ఓట్ షేర్ సాధించింది. ఫలితంగా 151 సీట్లు వచ్చాయి. ఈ సారి రెండు శాతం వరకు పోలింగ్ పెరిగింది. ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని ప్రతిపక్షాలు...అనకూల ఓటుగా వైసీపీ నేతలు వాదిస్తున్నారు. పోలింగ్ సమయంలోనూ ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందనే వాదన ఉంది. వైసీపీ మాత్రం ప్రభుత్వ సానుకూలత కనిపించిందని చెబుతోంది. కొందరు వైసీపీ నేతలు సీట్ల సంగతి ఎలా ఉన్నా..అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1.69 కోట్ల మంది మహిళలు ఓట్లు వేసారని..మెజార్టీ తమకే దక్కుతాయని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో మెజార్టీ వర్గాలు వైసీపీ పాలన పైన ఆగ్రహంతో ఉన్నారనే విశ్లేషణ ఉంది. వైసీపీ చేస్తున్న వాదనతో జూన్ 4న వెల్లడయ్యే ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications