‘ఈ-వాచ్’పైనే ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు, అనేక అనుమానాలు: నో డౌట్స్ అంటూ నిమ్మగడ్డ
అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ-వాచ్ పేరుతో ఓ యాప్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ యాప్పై అధికార వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
ఈ వాచ్పై వైయస్సార్సీపీ నేతల అనేక అనుమానాలు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఈ యాప్ని ప్రారంభించినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఎస్ఈసీ టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా వింటున్నారని విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలు.. ఈ యాప్పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ-వాచ్ యాప్ ఎక్కడ? ఎవరు? తయారు చేశారు.. ఎవరు నిర్వహిస్తున్నారు? డేటా బేస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? యాప్ లో పొందుపర్చిన సమాచారం భద్రత ఎంత? ఫిర్యాదుదారులు పంపించే ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్, ఎడిటింగ్ చేసే అవకాశాలపై అనుమానాలు, ఒక వర్గం వారి ఫిర్యాదులను మాత్రమే ఈ యాప్ లో చూపించే సాంకేతిక వెసులుబాటు కల్పించారా? అనే పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.
వైయస్సార్సీపీ యాప్ కూడా.. ‘ఈ-వాచ్ 'పైనే ఈసీకి ఫిర్యాదు
ఈ క్రమంలోనే వైసీపీ కూడా ఎస్ఈసీకి కౌంటర్గా మరో యాప్ సిద్ధం చేసింది. 'ఈ-నేత్రం' పేరుతో ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్షేత్రస్థాయిలో ఎక్కడి నుంచైనా.. ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ఈ ఫిర్యాదులను పార్టీ ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తుందని చెబుతున్నారు. ఇది ఇలావుంటే, ఎస్ఈసీ యాప్పై ఎస్ఈసీకే వైయస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ కార్యాలయంలో వైసీపీ నేతలు ఫిర్యాదు లేఖను అందజేశారు. ఈ వాచ్ యాప్ను వెంటనే ఉపసంహరించుకోవాలని, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల యాప్లను వినియోగాలను లేఖలో కోరారు.
నో డౌట్ అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. వైసీపీపై సెటైర్
కాగా, ఈ-వాచ్ యాప్ వెయ్యిశాతం పారదర్శకతతోనే రూపొందించినట్లు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ యాప్పై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంపై ాయన స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయకపోతేనే ఆశ్చర్యపడాలి తప్ప .. వేస్తే ఆశ్చర్యమేముందంటూ చురకలంటించారు. పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెల్లడించిన తర్వాత ఇందులో ఎలాంటి వివాదాలకు చోటు లేదన్నారు. ఎలాంటి సందేహాలు, ప్రశ్నలకు తావులేకుండా ఈ వాచ్ యాప్ను రూపొందించినట్లు నిమ్మగడ్డ తెలిపారు. తాను తక్కువ మాట్లాడి.. ఎక్కువ పనిచేస్తానని వ్యాఖ్యానించారు.