జగన్ కు చంద్రబాబును మించిన పరీక్ష- రెండేళ్లు లాక్కొచ్చేదెలా ? అధిగమిస్తేనే మరో ఛాన్స్ !
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో ఈ మూడేళ్లలో ఎన్నో ట్విస్టులు చూశాం. వైసీపీ ప్రభుత్వం కాగానే తనదైన శైలిలో విపక్షాలపై దూకుడుగా దూసుకెళ్లడం, దాన్ని ప్రతిఘటించే క్రమంలో విపక్షాలు కూడా అంతకు ముందు కనీవినీ ఎరుగని రీతిలో రూటు మార్చి కోర్టుల్లో కేసులు, ఇతరత్రా రూపాల్లో ప్రభుత్వాన్ని ప్రతిఘటించడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు వీటిన్నింటికీ మించిన పొలిటికల్ గేమ్ మొదలు కాబోతోంది. ఇప్పటివరకూ విపక్షాలు చేయలేని పనిని చేసేందుకు మరో కొత్త అస్త్రం వచ్చి చేరింది. జగన్ కు సిసలైన సవాల్ విసురుతోంది.
జగన్ వర్సెస్ చంద్రబాబు
ఏపీ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంలో అందరూ చూసింది జగన్ వర్సెస్ చంద్రబాబు పోరే. కాంగ్రెస్ నుంచి విడిపోయాక సొంత పార్టీ పెట్టుకుని టీడీపికి జగన్ సవాల్ విసిరితే దాన్ని ఎదుర్కొనేందుకు జనసేన, బీజేపీతో జట్టు కట్టి ఓసారి గెలిచిన చంద్రబాబు.. మరోసారి మాత్రం వారిని వదులుకుని ఒంటరి పోరుకు వెళ్లి ఓటమిపాలయ్యారు. దీంతో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ పోరులో ఎవరు గెలవబోతున్నారనే ఆసక్తి ఇప్పటినుంచే పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం రెండేళ్ల ముందే జగన్ మొదలుపెట్టిన పోరేనన్నది జగమెరిగిన సత్యం.
గడప గడపతో సవాల్ విసిరిన జగన్
ఎన్నికలకు రెండేళ్ల ముందే గడప గడపకు వైసీపీ కార్యక్రమంతో సీఎం జగన్ విపక్షాలకు సవాల్ విసిరారు. గతంలోనూ ప్రజల వద్దకే వెళ్లి ఓట్లు కొల్లగొట్టిన జగన్.. ఈసారి కూడా గడప గడప కార్యక్రమంతో జనంలోకి వెళ్తేనే ఫలితం ఉంటుందని భావించారు. అయితే వైసీపీ కంటే అధికారుల్ని కూడా తీసుకుని వెళ్లే మంచిదని భావించి దాన్ని రాత్రికి రాత్రే మార్చి గడప గడపకు ప్రభుత్వం పేరుతో ఇప్పుడు వైసీపీ నేతల్ని జనంలోకి పంపుతున్నారు. తద్వారా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ముందే గుర్తించి దాన్ని కొంతైనా అధిగమించాలన్నది ఆయన ప్రయత్నం. కానీ అది నేరవేరుతోందా అంటే మాత్రం ఎవరి దగ్గరా ప్రస్తుతానికి సమాధానం లేదు.
ముందే బ్యాక్ ఫైర్
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లి వారి కోర్కెల్ని కనీస స్ధాయిలో అయినా తీర్చాలని భావించిన జగన్ కు ఆదిలోనే చుక్కెదురవుతోంది. ఎమ్మెల్యేలతో పాటు నామినేటెడ్ నేతలు, ద్వితీయ స్ధాయి నేతల్ని ముందుగా జనంలోకి పంపుతున్న జగన్.. ఆ తర్వాత పరిస్ధితిని బట్టి మంత్రుల్ని కూడా జనంలోకి పంపాలని భావించారు. కానీ తొలి రోజు నుంచే ఈ కార్యక్రమానికి నిరసనల సెగ తగులుతోంది. అదీ ఏ స్ధాయిులో అంటే ప్రభుత్వం ఇంతకాలం గొప్పగా చెప్పుకుంటున్న సంక్షేమం రూపంలోనే. సంక్షేమం తన తండ్రి వైఎస్ హయాం తరహాలోనే సాచురేషన్ విధానంలో జరగాలని భావించిన జగన్ కు ఆర్ధిక పరిస్దితులు సహకరించడం లేదు. అలాంటి పరిస్ధితుల్లో ఇప్పుడు సంక్షేమం పూర్తి స్ధాయిలో చేయకుండా జనంలోకి వెళ్లడంతో జనం నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నాయి.
చంద్రబాబును మించిన పరీక్ష
ఇప్పటివరకూ చంద్రబాబును మాత్రమే తన ప్రధాన శత్రువుగా, ప్రత్యర్ధిగా జగన్ భావించారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాక ప్రజాగ్రహాన్ని గమనించి దూకుడుగా ఆయనపైకి వెళ్లిన జగన్.. ప్రజా వేదిక కూల్చివేత, టీడీపీ ఆఫీసులపై దాడుల వరకూ వెళ్లారు. కానీ క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు ప్రభుత్వం పై పెరుగుతున్న వ్యతిరేకత తిరిగి టీడీపీకే వరంగా మారుతోంది. దీని ప్రభావం గడప గడపకు ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో నిరసనలకు టీడీపీ నేతలే కారణమంటూ వైసీపీ నేత సజ్జల చెబుతున్నా వాస్తవ పరిస్ధితి అంత సానుకూలంగా లేదనే సందేశం జగన్ కు అందుతోంది. అయినా పట్టించుకోకుండా ముందుకే వెళ్లాలని మంత్రులకు ఆయన సూచిస్తున్నారు.
మరో ఛాన్స్ దక్కాలంటే తప్పదా?
2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరుతో జనంలోకి వెళ్లి అధికార పగ్గాలు అందుకున్న జగన్ కు ఇప్పుడు గడప గడపకూ ప్రభుత్వం రూపంలో మరోసారి జనంలోకి వెళ్లి సంక్షేమాన్ని వివరించాల్సిన అవసరం ఏర్పడింది. సంక్షేమం చేయడమే ఓ ఎత్తయితే దాన్ని జనంలోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందులో జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డిది అందె వేసిన చేయి.
అప్పట్లో కేవలం రెండే రెండు కొత్త పథకాలతో జనంలోకి వెళ్లి 2009 ఎన్నికల్లో అనూహ్యంగా సక్సెస్ అయిన వైఎస్ తరహాలోనే జగన్ కూడా జనంలోకి వెళ్లాల్సి ఉంది. కానీ గడప గడపలో ప్రస్తుతం ఎదురవుతున్న నిరసనల్ని తట్టుకుని జగన్ నేరుగా జనంలోకి వెళ్లగలరా.. అప్పటివరకూ ఈ ప్రతిఘటనను వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తట్టుకుంటారా ? లేక జనంపై విరుచుకుపడి వారి ఆగ్రహం చవిచూస్తారా ? అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా మరో ఛాన్స్ దక్కాలంటే మాత్రం జగన్ తాను మొదలుపెట్టిన కార్యక్రమం కష్టనష్టాలకు తట్టుకుని కొనసాగించక తప్పని పరిస్ధితి నెలకొంది.