వైసీపీ, టీడీపీ హైఓల్టేజ్ వార్- గడప గడపకు వర్సెస్ బాదుడే బాదుడు- 2024 విజేత నిర్ణయం ఇక్కడే !
ఏపీలో వైసీపీ సర్కార్ పన్నులు, ఛార్జీల పెంపును నిరసిస్తూ విపక్ష టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం, ఆ తర్వాత తమ ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి ఓట్లు కోరేందుకు వైసీపీ ప్రారంభించిన గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ కు ప్రతిరూపాలుగా మారిపోయిన ఈ రెండు కార్యక్రమాల్లో ఏది సక్సెస్ అయినా తమ పార్టీ అధినేతల్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టే అవకాశం ఉండటంతో ఇప్పుడు ఇరు పార్టీల దృష్టీ వీటిపైనే నెలకొంది.

టీడీపీ బాదుడే బాదుడు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం గత ఏడాది కాలంలో వరుసగా పన్నులు బాదేసింది. ఆస్తిపన్ను, చెత్తపన్ను, ఆర్టీసీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు ఇలా వరుసగా పెంచేసిన ఛార్జీలు, పన్నులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీన్ని గమనించిన విపక్ష టీడీపీ వెంటనే బాదుడే బాదుడు కార్యక్రమంలో రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ టీడీపీ నేతల్ని రంగంలోకి దించి వైసీపీ ప్రభుత్వం బాదుడుని జనానికి వివరించే ప్రయత్నం చేస్తోంది. దీంతో జనంలో ఆదరణ కూడా దక్కుతోంది. ముఖ్యంగా వైసీపీ సర్కార్ ఓ చేత్తో పంచుతున్న డబ్బును మరోవైపు ఎలా లాక్కుంటుందో టీడీపీ వివరిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.

వైసీపీ గడప గడపకూ ప్రభుత్వం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇన్నాళ్లూ చేపట్టిన సంక్షేమాన్ని జనంలోకి తీసుకెళ్లి మరోసారి ఓట్లు అడగాలని నిర్ణయించుకుంది. గతంలో నవరత్నాల్ని తీసుకెళ్లి గడప గడపలోఓట్లు అడిగిన వైసీపీ.. ఈసారి సంక్షేమం అమలును చూపించి జనంలో ఓట్లు అడగాలని నిర్ణయించుకుంది. దీంతో వైసీపీ గడప గడపకూ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయగలిగితే చాలు వైసీపీ 2024 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని జగన్ బలంగా విశ్వసిస్తున్నారు.

గడప గడపకు నిరసనల స్వాగతం
వైసీపీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రారంభించిన గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి నిరసనల సెగ తప్పడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అన్ని గడపలకూ చేరకపోవడమే. ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వంలోనూ దాదాపు సగానికి పైగా జనాభాకు సంక్షేమం చేరడం కల్లే. అయితే ఈసారి వైసీపీ సర్కార్ మాత్రం అర్హులైన వారిని వెతికి మరీ పథకాలు ఇస్తున్నామని చెప్పుకుంటున్న తరుణంలో జనంలో ఆశలు పెరుగుతున్నాయి. దీంతో తమకు పథకాలు అందడం లేదనే కారణమే ఎక్కువగా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ఎదురవుతున్న నిరనసల్లో వినిపిస్తోంది. దీంతో ప్రజాప్రతినిధులకు ఈ సెగ తగులుతోంది.

2024లో సీఎంను నిర్ణయించే పోరు !
ఏ ఎన్నికల్లో అయినా అధికారం కావాలంటే రాజకీయ పార్టీలు ప్రజల్లోకి ఎక్కువగా చొచ్చుకుపోవడమే సక్సెస్ మంత్రంగా భావిస్తుంటాయి. 2019లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం వెనుక జగన్ జనంలో నిరంతరం ఉండటమే కారణం. ఇప్పుడు మరోసారి 2024లో అధికారం కావాలంటే గడప గడపకూ ప్రభుత్వం రూపంలో జనంలో ఉండాలని జగన్ తన నేతలకు సూచిస్తున్నారు. తాను చివర్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఇప్పుడు అదే మంత్రాన్ని ఒడిసి పట్టుకుని బాదుడే బాదుడు పేరుతో జనంలోకి వెళ్లేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సహజంగానే ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత, ఛార్జీల పెంపు బాధతో ఉన్న ప్రజల్లో టీడీపీ నేతలకు బాగానే ఆదరణ లభిస్తోంది. అయితే దీన్ని ఎన్నికల వరకూ కొనసాగించగలిగితే ఆ పార్టీకి అధికారం దక్కే అవకాశముంది. అలాగే దీనికి వైసీపీ నుంచి సరైన కౌంటర్ ఇవ్వగలిగితే మాత్రం జగన్ మరోసారి సీఎం కావడం ఖాయం.












Click it and Unblock the Notifications