అమరావతిపై సుప్రీం ఆర్డర్-అనుకూలంగా మార్చుకున్న వైసీపీ- మౌనంతో డిఫెన్స్ లోకి విపక్షాలు ?
ఏపీలో అమరావతి స్దానంలో మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు వైసీపీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు తాజాగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు ఆ పార్టీకి మరింత బలాన్నిచ్చాయి. అదే సమయంలో విపక్షాలను డీలా పడేలా చేశాయి. వాస్తవానికి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుతో ఇక మూడు రాజధానుల పనైపోయిందని అంచనా వేసుకున్న విపక్షాలకు సుప్రీంకోర్టు తీర్పు బ్రేక్ వేసినట్లు అర్ధమవుతోంది. దీంతో వైసీపీ సహజంగానే పైచేయి సాధించినట్లయింది.

అమరావతిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు
అమరావతిలో రాజధాని నిర్మాణాల్ని పూర్తి చేయడంలో అసాధారణ జాప్యం జరిగినందున వాటిని నెల రోజుల్లో కొన్ని, ఆరునెలల్లో మరికొన్ని పూర్తిచేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు దీనపై స్టే ఇచ్చింది. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు హైకోర్టు ఇచ్చిన గడువు సహేతుకంగా లేదని భావించిన సుప్రీంకోర్టు వాటిని అమలు చేయాల్సిన అవసరం లేదని మధ్యంతర ఉత్తర్వుల్లో తెలిపింది. అంతవరకూ బాగానే ఉన్నా మిగతా అంశాలపై మాత్రం ఎలాంటి స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో రాజకీయ పార్టీలు ఈ తీర్పును తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డాయి.

సుప్రీంతీర్పుతో వైసీపీ హ్యాపీ
అమరావతి రాజధాని నిర్మాణాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో అధికార వైసీపీ హ్యాపీగా కనిపిస్తోంది. ఈ తీర్పు వెలువడిన వెంటనే దీనిపై స్పందించిన వైసీపీ నేతలు.. దీన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత విపక్షాల స్పందన కోసం ఎదురుచూశారు. కానీ స్పందన రాకపోవడంతో ఈ తీర్పు సరిగ్గా తాము ఊహించినట్లుగానే ఉందంటూ వరుసగా రెండో రోజు పార్టీ నేత సజ్జల మరో ప్రకటన చేశారు. తద్వారా సుప్రీంకోర్టు తీర్పును తమకు అనుకూలంగా అన్వయించుకునేందుకు ప్రయత్నించారు. ఇదే ఇప్పుడు కీలకంగా మారింది.

మౌనంతో డిఫెన్స్ లో పడ్డ విపక్షాలు ?
అమరావతి రాజధానిలో నిర్మాణాల గడువు విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన వ్యవహారంపై స్పందించేందుకు విపక్షాలు ఎందుకో ఇష్టపడటం లేదు. ఇప్పటిదాకా అమరావతికి పూర్తిస్ధాయిలో మద్దతుగా నిలుస్తున్న టీడీపీ, సీపీఐతో పాటు జనసేన, బీజేపీ నేతలు కూడా సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించేందుకు ముందుకు రావడం లేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు వైఎస్ వివేకా కేసు బదిలీపై ఇచ్చిన తీర్పుపై మాత్రం వరుసగా స్పందిస్తున్న విపక్ష నేతలు అమరావతి తీర్పుపై స్పందించకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా సుప్రీంకోర్టు ఉత్తర్వులతో విపక్షాలు డిఫెన్స్ లో పడినట్లే కనిపిస్తోంది.

వైసీపీ మైండ్ గేమ్ సక్సెస్ ?
సుప్రీంకోర్టు అమరావతి నిర్మాణాల పూర్తి విషయంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కేవలం కాల పరిమితితో కూడిన అంశాలకు మాత్రమే వర్తిస్తాయి. కానీ వీటిని మించి మరో విషయం ఉంది. అది రాజధాని నిర్ణయాధికారం అసెంబ్లీకి ఉందా లేదా అనేది. హైకోర్టు లేదని గతంలో చెప్పింది. దీనిపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ససేమిరా అంది. ఈ నేపథ్యంలో సహజంగా విపక్షాలు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. కానీ గతంలో అదే అసెంబ్లీ అధికారంతో అమరావతి రాజధానిగా నిర్ణయించారు. దీంతో ఈ వాదన కూడా తమకు అనుకూలమని గట్టిగా చెప్పుకునే పరిస్దితి లేదు. ఇలా రెండు కీలక అంశాల్లో సుప్రీంతీర్పు తమకు అనుకూలమని గట్టిగా చెప్పుకునే పరిస్ధితి విపక్షాలకు లేకుండా పోయింది. ఒక వేళ చెప్పుకుందామనుకున్నా అప్పటికే వేగంగా స్పందించిన అధికార వైసీపీ పరిస్ధితిని తమకు అనుకూలంగా మార్చేసుకుంది. ఇప్పుడు వైసీపీ మైండ్ గేమ్ ను ఛేధించి సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలమని విపక్షాలు చెప్పుకునే పరిస్దితి లేకుండా పోయింది. అందుకే కేవలం రైతులకు అనుకూలమని మాత్రమే టీడీపీ నేత ఆలపాటి రాజా తాజాగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications