జగన్ సొంతగడ్డపై వైసీపీ పాత వ్యూహం- ఏకగ్రీవంపై యూటర్న్-నంద్యాల, తిరుపతి ఫార్ములాకు చెక్
ఏపీలో ఉపఎన్నికల సందర్భంగా చోటు చేసుకునే రాజకీయాలు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. తమకు పరిస్ధితులు అనుకూలంగా ఉన్న సందర్భాల్లో ఒకలా.. ప్రతికూలంగా ఉంటే మరోలా రాజకీయాలు చేయడం పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు తాజాగా షెడ్యూల్ ప్రకటించిన కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికల్లోనూ అధికార వైసీపీ ఇదే రాజకీయానికి తెరదీస్తోంది. దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే స్ధానంలో కుటుంబ సభ్యులకు సీటు ఇచ్చినందున ఏకగ్రీవానికి విపక్షాలు సిద్ధమైతే ఆహ్వానిస్తామంటూ సన్నాయినొక్కులు నొక్కుతోంది. టీడీపీ అభ్యర్ధి ప్రకటన తర్వాత వైసీపీ నేత సజ్జల చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారుతోంది.
వైసీపీ ఉపఎన్నికల రాజకీయం
ఏపీలో ఉపఎన్నికల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల్ని మరిపించేలా ఆ ఎన్నికను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటాయి. అయితే ఎవరైనా ఎమ్మెల్యే మరణం కారణంగా ఉపఎన్నిక జరిగితే సదరు ఎన్నికను ఏకగ్రీవం చేద్దామనే ప్రతిపాదనలు గతంలో వినిపించేవి. కానీ వైసీపీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఫార్ములాకు చెక్ పెట్టేసింది. తనకు వీలైన నందిగామ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్ధి తంగిరాల సౌమ్యకు సహకరించి ఏకగ్రీవం చేసిన వైసీపీ.. నంద్యాల ఉపఎన్నికకు వచ్చే సరికి రూటు మార్చేసింది. దివంగత భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ సీటులో ఉపఎన్నిక వస్తే శిల్పా మోహన్ రెడ్డిని నిలబెట్టి పాత ఫార్ములాపై యూటర్న్ తీసేసుకుంది. అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది తిరుపతి ఎంపీ సీటుకు జరిగిన ఉపఎన్నికలోనూ ఏకగ్రీవం ఆశించకుండా, అలాగని దివంగత ఎంపీ కుటుంబానికి సీటివ్వకుండా మరొకరిని నిలబెట్టి గెలిపించుకుంది. దీంతో ఇక ఏకగ్రీవాల మాట వినిపించదనే అంతా భావించారు.
బద్వేలు ఉపఎన్నిక
కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 30న ఉపఎన్నిక జరగబోతోంది. వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో ఖాళీ అయిన ఈ స్ధానంలో ఆయన భార్య డాక్టర్ సుధకు వైసీపీ టికెట్ ఇచ్చింది. ఇప్పటికే ఏపీలో తాజాగా జరిగిన పలు ఎన్నికల్లో విపక్షాలపై పైచేయి సాధించిన వైసీపీ.. ఇప్పుడు బద్వేల్లోనూ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. బద్వేల్లో దివంగత ఎమ్మెల్యే భార్యకే టికెట్ ఇచ్చినందున విజయం నల్లేరుపై నడకేనని వైసీపీ అంచనా వేసుకుంటోంది. అంతటితో ఆగకుండా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మరో ట్విస్ట్ ఇచ్చారు.
సజ్జల నోట ఏకగ్రీవం మాట
కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ సీటుకు జరుగుతున్న ఉపఎన్నికలో దివంగత ఎమ్మెల్యే కుటుంబ సభ్యురాలికే టికెట్ ఇచ్చాం కాబట్టి విపక్షాలు సహకరిస్తే ఏకగ్రీవం చేసుకోవచ్చని వైసీపీకి కొత్త ఆలోచన వచ్చింది. విపక్షాలు ఏకగ్రీవానికి సహకరిస్తామంటే ఆహ్వానిస్తామంటూ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఏకగ్రీవంపై వైసీపీ ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చిందనే చర్చ మొదలైంది. అదీ ఏకగ్రీవాల విషయంలో ఎప్పుడో తన స్టాండ్ మార్చేసుకున్న వైసీపీ ఇప్పుడు బద్వేల్లో ఏకగ్రీవం ఎందుకు కోరుకుంటోందనే చర్చ జరుగుతోంది.
జగన్ సొంతగడ్డపై ప్రతిష్ఠాత్మకం
జగన్ సొంత జిల్లా కడపలోని బద్వేల్ అసెంబ్లీ సీటులో జరుగుతున్న ఉపఎన్నిక కావడంతో ఇది వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ముఖ్యంగా బద్వేలులో వైసీపీ ఓటమిపాలైతే విపక్షాలు జగన్ సొంత గడ్డపై అసెంబ్లీ సీటు గెలిపించుకోలేకపోయారనే అంశాన్ని హైలెట్ చేస్తాయన్న భయం వైసీపీని వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల్ని బట్టి చూసినా బద్వేలులో వైసీపీ ఘన విజయం ఖాయమే. కానీ ముందే ఏకగ్రీవం చేసేసుకుంటే ఆ రిస్క్ కూడా ఉండదన్న భావన సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో కనిపిస్తోంది.
టీడీపీ అభ్యర్ధి ప్రకటించాక
బద్వేలు ఉపఎన్నికలో వైసీపీ ఏకగ్రీవ ప్రతిపాదన చేయడం వెనుక ఉన్న అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అదే సమయంలో బద్వేలు ఉపఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్ధీ ప్రకటించకముందే ఏకగ్రీవం కోరితే అప్పుడు దానిపై చర్చ కూడా జరిగేది. కానీ టీడీపీ అభ్యర్ధిగా చంద్రబాబు ఓబుళాపురం రాజశేఖర్ ను మరోసారి బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్న పది రోజుల తర్వాత వైసీపీ ఇప్పుడు ఏకగ్రీవ ప్రకటన చేయడంతో ఇది కచ్చితంగా రాజకీయంలో భాగమేననే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్ధిపై గతంలో ఓడిన సానుభూతి ఉండటం, వైసీపీ అభ్యర్ధి దివంత ఎమ్మెల్యే భార్య అయినా రాజకీయాలకు కొత్త కావడం వంటి పరిణామాలు ఇందుకు దారి తీసి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.
Recommended Video
ఏకగ్రీవాలపై వైసీపీ మరో యూటర్న్ ?
ఏపీలో ఏదైనా అసెంబ్లీ లేదా పార్లమెంటు స్ధానంలో సిట్టింగ్ సభ్యుడి మరణంతో ఖాళీ అయిన సీటులో జరిగే ఉపఎన్నికలో సదరు నేత కుటుంబ సభ్యుల్ని నిలబెడితే ఏకగ్రీవం చేద్దామనే ప్రతిపాదన గతంలో వైఎస్ జగన్ తండ్రి వైఎస్సార్ చేశారు. దీవికి మిగతా పార్టీలు కూడా సరేనన్నాయి. వైఎస్ మరణం వరకూ ఆ సంప్రదాయమే కొనసాగింది. కానీ వైసీపీ మాత్రం మధ్యలో దీనిపై యూటర్న్ తీసుకుని దివంగత నేతల కుటుంబ సభ్యులపై అభ్యర్ధుల్ని పోటీ పెట్టింది. విపక్షాలు వారించినా పట్టించుకోలేదు తిరుపతిలో అయితే ఏకంగా దివంగత నేత కుటుంబానికి టికెట్ ఇవ్వకుండా మరెవరినో రంగంలోకి దింపి గెలిపించుకుంది. దీంతో వైసీపీ ఇక ఏకగ్రీవాల్ని మర్చిపోయినట్లేనన్న భావన సర్వత్రా కనిపించింది. కానీ ఇప్పుడు మరోసారి యూటర్న్ తీసుకుని బద్వేల్ ఉపఎన్నికలో ఏకగ్రీవానికి విపక్షాలకు ఆఫర్ ఇస్తోంది. విపక్షాలు ముందుకొస్తే ఆహ్వానిస్తామని చెబుతోంది.