YSRCP Mlas: జగ్గంపేట, పిఠాపురం, పత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యేల దారెటు ?
ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ల మార్పు కాకరేపుతోంది. ఇప్పటికే గడప గడపతో పాటు పలు కార్యక్రమాలు పెట్టి వాటిలో విస్తృతంగా ఎమ్మెల్యేలను తిప్పిన జగన్.. ఇప్పుడు టికెట్ల వరకూ వచ్చేసరికి నిరాకరిస్తుండటంతో పలువురు ఎమ్మెల్యేలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వారు ఎన్నికలకు ముందు వైసీపీని వీడి ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
తాజాగా వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా సీఎం జగన్ తో భేటీ అయిన పలువురు ఎమ్మెల్యేలు తమకు టికెట్ రాదని తేలిపోవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో వారు విపక్ష టీడీపీ, జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లిపోయారు. వారు నేరుగా విపక్ష పార్టీల్లో చేరిపోవడంతో పాటు తమకు లేదా కుటుంబ సభ్యులకు ఈసారి టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ జాబితాలో కాకినాడ జిల్లాకు చెందిన జగ్గంపేట, పిఠాపురం, పత్తిపాడు ఎమ్మెల్యేలు ఉన్నారు.

వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కు మరోసారి టికెట్లు లేవని తేలిపోయింది. దీంతో వీరిలో జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఇద్దరూ టీడీపీలోకి ఫిరాయించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాత్రం జనసేనలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు త్వరలో టీడీపీలో చేరనున్నారు. జగన్ నిర్ణయంపై ఇప్పటికే కార్యకర్తలతో ఆయన సమాలోచనలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో చేరాలని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5న టీడీపీలో జ్యోతుల చంటిబాబు చేరే అవకాశం ఉంది. మిగతా ఇధ్దరు ఎమ్మెల్యేలు కూడా ముహుర్తం చూసుకుని టీడీపీ, జనసేనలో చేరబోతున్నారు.












Click it and Unblock the Notifications