వైసీపీ కాపు మంత్రులు -ఎమ్మెల్యేల కీలక భేటీ : పవన్ కు కౌంటర్ స్ట్రాటజీ ..!!
వైసీపీలోని కాపు నేతలు ఒకే వేదిక మీదకు వస్తున్నారు. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు రాజమండ్రి వేదిక కానుంది. ఈ నెల 31న వైపీపీ కాపు మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో పాటుగా ప్రజాప్రతినిధులు భేటీ కావాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల దిశగా వైసీపీ మరోసారి సోషల్ ఇంజనీరింగ్ మొదలు పెట్టింది. 2019 ఎన్నికల్లో పక్కాగా అమలు చేసిన ఇదే సూత్రం అధికారం కట్టబెట్టడానికి దోహదం చేసింది. ఇప్పుడు ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు..పొత్తుల వేళ వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

కాపు నేతల కీలక భేటీ
ఇప్పటికే బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలంతా సమావేశం అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి బీసీలకు ప్రభుత్వంలో దక్కిన గౌరవం.. ప్రాధాన్యత గురించి వివరించారు. ప్రభుత్వ మేలును బీసీ వర్గాల్లోకి మరింతగా తీసుకెళ్లే బాధ్యతలను బీసీ వర్గ నేతలకు పార్టీ అప్పగించింది. ఇదే సమయంలో ఇప్పుడు కాపు నేతల సమావేశం కీలకంగా మారనుంది. జనసేన - టీడీపీ పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గ ఓట్లు జనసేన వైపు మళ్లే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో వైసీపీ కాపు నేతలకు తాజాగా పవన్ కళ్యాణ్ తాజాగా వార్నింగ్ ఇచ్చారు. ఇక..ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం 2019 ఎన్నికల్లో ఎక్కువ శాతం వైసీపీకి అండగా నిలిచింది.

కాపు వర్గం వైసీపీతోనే ఉండేలా
ఈ సారి సమీకరణాలు మారే అవకాశం ఉండటంతో, ముందుగానే కాపు నేతలు అప్రమత్తవుతున్నారు. కాపు వర్గంతో ఓట్లు వేయించుకొని.. చంద్రబాబును సీఎం చేయటానికి పవన్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారాన్ని వైసీపీ కాపు నేతలు తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. దీంతో పాటుగా వైసీపీ ప్రభుత్వంలో కాపులకు అందిన లబ్ది గురించి మరింతగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం దీక్ష సమయంలో టీడీపీ ప్రభుత్వం లో వ్యవహరించిన తీరును వైసీపీ కాపు నేతలు గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ముద్రగడ కుటుంబం నుంచి పార్టీలో చేరికలు ఉంటాయనే ప్రచారం సాగుతోంది. కాపు సామాజిక వర్గం ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటోంది.. చేయాల్సినవి ఏంటనే అంశాల పైన ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

టార్గెట్ పవన్ కళ్యాణ్
గోదావరి జిల్లాల్లో ఇతర పార్టీల్లోని కాపు నేతల చేరికలను ప్రోత్సహించే అంశం పైనా చర్చ జరుగుతోంది. దీంతో పాటుగా కాపు సంక్షేమానికి ఈ మూడున్నేళ్ల కాలంలో అమలు చేసిన నిర్ణయాలను వివరించాలని డిసైడ్ అయ్యారు. ప్రధానంగా కాపు వర్గం వైసీపీ నుంచి దూరం కాకుండా రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాల పైన ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీలకు అతీతంగా కాపు నేతలు తరచూ నిర్వహిస్తున్న సమావేశాల పైన వైసీపీ కాపు నేతల మీటింగ్ లో చర్చించే ఛాన్స్ ఉంది. దీంతో..ఇప్పుడు రాజమండ్రి వేదికగా వైసీపీ కాపు నేతల సమావేశం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications