కొండవీటి శునకం..వెన్నుపోటు వేటగాడు! బెజవాడను దివాళా తీయిస్తోన్న ఇస్మార్ట్ నాని: పీవీపీ
విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ మధ్య రాజుకున్న వివాదం..నానాటికి తీవ్రమౌతోంది. బ్యాంకులను ముంచేస్తోన్న ఆర్థిక నేరస్తుడు పీవీపీ అంటూ కేశినేని నాని.. తొలుత ఈ వివాదానికి తెర తీశారు. దీన్ని పీక్ కు తీసుకెళ్తున్నారు పొట్లూరి. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం ఈ గొడవలో లాగుతున్నారు. చంద్రబాబు అమెరికా రోడ్ల మీద పాప్ కార్న్ తింటూ కులాసాగా కాలక్షేపం చేస్తోండగా.. ఆయన శిష్యుడు కేశినేని నాని బెజవాడను దివాళా తీయిస్తున్నారని అన్నారు. కేశినేని నానిని ఇస్మార్ట్ నాని అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై ఆదివారం ఆయన వరుస ట్వీట్లను సంధించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఆస్తులు వేలానికి రానున్నాయి. కెనరా బ్యాంకునకు ఆయన 148 కోట్ల 90 లక్షల రూపాయలను బకాయి పడ్డారు. దీన్ని వసూలు చేయడానికి కెనరా బ్యాంకు యాజమాన్యం వేలం పాటను నిర్వహించబోతోంది. పొట్లూరి వరప్రసాద్ కు చెందిన పీవీపీ కేపిటల్ లిమిటెడ్ సంస్థను ఈ నెల 14వ తేదీన వేలం వేయనుంది. ఎక్కడ, ఎక్కడ ఎలా ఉన్నది అక్కడా అలా ప్రాతిపదికన వేలం నిర్వహించనున్నట్లు కెనరా బ్యాంకు వెల్లడించింది. దీనికోసం రెండు నెలల కిందటే ఓ నోటీసును జారీచేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను అడ్డుగా పెట్టుకుని కేశినేని నాని.. పీవీపీని ఆర్థిక నేరస్తునిగా విమర్శించారు.
దీనిపై పొట్లూరి ఎదురుదాడికి దిగారు. తాను నిజాయితీగా కేసులను ఎదుర్కొంటున్ననని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల తరహాలో ఆర్థిక నేరాలకు పాల్పడి తాను కాషాయ కండువాను కప్పుకోవట్లేదని విమర్శలను తిప్పికొట్టారు. కేశినేని నాని స్వయంగా దివాళా తీశారని గుర్తు చేశారు. తన వ్యాపారాలను మూసేశారని అన్నారు. తన సొంత వ్యాపారాలను మూసేయడం ద్వారా తనను నమ్ముకున్న వారిని రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. బెజవాడను దివాళా తీయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పాప్ కార్న్ తింటూ అమెరికా రోడ్ల మీద కులాసాగా తిరుగుతోంటే.. ఆయన సహచరుడు కేశినేని నాని.. ఇస్మార్ట్ శంకర్ గా మారిపోయారని, అందర్నీ బెజవాడ రోడ్డున పడేశారని విమర్శించారు. హెరిటేజ్ పాలు పంపిస్తే.. బారులు తీరిన అప్పుల వాళ్లకు, ఓ కప్పు కాఫీ ఇస్తామని పొట్లూరి వరప్రసాద్ చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు.
లోకేష్ ను తిట్టబోయి..చంద్రబాబును మెచ్చుకున్న మంత్రిగారు! పబ్లిసిటీ లేక పిచ్చిపట్టినట్టుందా?
తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి త్వరలో కొన్ని బ్లాక్ బస్టర్స్ మూవీస్ రానున్నాయని ఎద్దేవా చేశారు. మాయా దేశం, బొబ్బిలి పిల్లి, మైనర్ 'చంద్ర'కాంత్, సర్దార్ పప్పల రాయుడు, అడవి చంద్రుడు, సమర చంద్రా రెడ్డి, నరకాసుర నాయుడు, కొండవీటి శునకం, ఇన్ జస్టిస్ చౌదరి, వెన్నుపోటు వేటగాడు, జై తారక రామ అనే సినిమాలకు తెలుగుదేశం నాయకులు ప్లాన్ చేసుకోవాల్సిందేనని పొట్లూరి వరప్రసాద్ చురకలు అంటించారు. ఆయన చేసిన ట్వీట్ల తీవ్రతను బట్టి చూస్తోంటే.. ఇప్పట్లో ఈ ఇద్దరు నేతల మధ్య నెలకొన్న రాజకీయ వివాదాలు, ఆరోపణలు, ప్రత్యారపణలు.. ఇప్పట్లో ఆగేలా లేవనినిపిస్తోందని సాధారణ కార్యకర్తలు చెబుతున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ఇలా పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.