గోపీకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి నేత, హిందూపురం నియోజకవర్గ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ ఇక్బాల్కు ప్రైవేట్ పీఏగా వ్యవహరిస్తున్న గోపికృష్ణను శనివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న మంజునాథ అలియాస్ వరుణ్, మహేష్ తో గోపికృష్ణ మాట్లాడిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తన కుమారుడి హత్యలో ఎమ్మెల్సీ పీఏ పాత్ర ఉందని రామకృష్ణారెడ్డి తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గోపీకృష్ణను ఏ-5గా చేర్చారు.
ఇతర నిందితుల్ని పదిరోజులుగా విచారిస్తున్న పోలీసులు గోపీకృష్ణ పట్టణంలోనే ఉన్నప్పటికీ అదుపులోకి తీసుకోవడానికి మీనమేషాలు లెక్కించారు. ఫోన్ కాల్స్ రికార్డింగ్ ఆడియోలను వరుణ్, మహేష్ బంధువులే బయట పెట్టినట్లుగా తెలుస్తోంది. హత్యకు కుట్రదారులు తప్పించుకుంటున్నారని, తమవారు మాత్రం బలవుతున్నారనే ఆందోళనతో వారు వీడియోలు విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇంకా ఆడియోలున్నాయని, నిందితుల కాల్స్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తే అందరూ బయటకు వస్తారని రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు అంటున్నారు.
హిందూపురం నియోజకవర్గ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి ఈనెల 8వ తేదీ రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆరోజు రామకృష్ణారెడ్డి ఎవరెవరిపై అనుమానం వ్యక్తం చేశారో వారందరి విషయాలు, వారు హత్యకు వేసిన ప్రణాళిక ఆ ఆడియోలో ఉన్నాయి. కేసులో ప్రధాన నిందితుడిగా మంజునాథ్ అలియాస్ వరుణ్ ఉన్నారు. ఆయన మరో నిందితుడు మహేష్ తో మట్లాడిన మాటలు, అలాగే మరో ఆడియోలో వరుణ్, మూర్తి అనే వ్యక్తితో మాట్లాడటం, మధ్యలో ఎమ్మెల్సీ ఇక్బాల్ పీఏ గోపీకృష్ణతో కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడటంలాంటి విషయాలన్నీ బయటకు వచ్చాయి.