పిచ్చెక్కి మాట్లాడుతున్న లోకేశ్ ను ప్రజలే తరిమికొడతారన్న వైసీపీ మంత్రి జయరాం
కర్నూలు జిల్లాలో పెసరవాయి గ్రామంలో టిడిపి నేతలు వడ్డు నాగేశ్వర్ రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డి హత్య పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, వైయస్సార్ సిపి నాయకులను లక్ష్యంగా చేసుకొని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు కర్నూలు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించిన లోకేష్ వదిలిపెట్టం.. వేటాడతాం అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారా లోకేష్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని, లోకేష్ ను ప్రజలు తరిమి కొడతారని వ్యాఖ్యానించిన ఆయన, సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను గెలిపించిన ధీరుడని కితాబిచ్చారు. ఇదే సమయంలో మంగళగిరిలో లోకేష్ ను ప్రజలు తరిమి కొట్టారు అని గుర్తు చేశారు. కనీసం నీ తండ్రి చంద్రబాబు కూడా నిన్ను గెలిపించుకోలేకపోయాడు అంటూ మంత్రి జయరామ్ లోకేష్ ను ఎద్దేవా చేశారు .
Recommended Video
అలాంటి లోకేష్ సీఎం జగన్ గురించి మాట్లాడటం,ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు మంత్రి జయరామ్. అంతేకాదు టీడీపీ హయాంలో వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య జరిగిందని పేర్కొన్న మంత్రి జయరామ్ ఆనాడు టిడిపి నేతలే నారాయణ రెడ్డిని చంపేశారని, అప్పుడు లోకేష్ ఏమయ్యాడు అంటూ ప్రశ్నించారు. లోకేష్ ఏం చేసినప్పటికీ కర్నూలులో రాజకీయ భవిష్యత్తు లేదని, కర్నూలు ప్రజలు టిడిపిని ఆదరించరని మంత్రి జయరామ్ పేర్కొన్నారు.