వారి కోసమే పవన్ కళ్యాణ్ తాపత్రయం; జనసేనానిపై విరుచుకుపడిన గుడివాడ అమర్నాథ్!!
వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. విశాఖ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తున్న జగన్ ను కావాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో దీక్ష చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేయడంపై ఆయన మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ దీక్షలో చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే రివర్స్ కౌంటర్
పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగించిన దీక్షలో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ విశాఖ ఉక్కు పై వైసిపి నిలదీయాలని పేర్కొన్న పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్రం చేతుల్లో ఉందని, పవన్ కళ్యాణ్ పోరాటం చేయాల్సింది బీజేపీ ప్రభుత్వం పైన అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తానని వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు.

పొలిటికల్ పార్ట్ నర్స్ బాగు కోసమే పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతున్నాడు
ఉత్తరాంధ్ర కు ద్రోహం చేసే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. రాష్ట్రం ఏమైపోయినా పవన్ కళ్యాణ్ కు పర్వాలేదు అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉందని నిప్పులు చెరిగారు. తన పొలిటికల్ పార్ట్ నర్స్ బాగు కోసమే పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతున్నాడు అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపణలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా భావించి వెనక్కి తీసుకున్న వ్యవసాయ చట్టాలు రైతులకు న్యాయం చేసే చట్టాలని గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ కు వ్యవసాయ చట్టాలపై చిత్తశుద్ధి, అవగాహన లేవని విమర్శించారు.

పవన్ కు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిలదీయాలి
ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ వైసీపీని తప్పుబట్టడం అలాంటిదేనని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకోక ముందు పవన్ కళ్యాణ్ బీజేపీ పై విరుచుకు పడ్డారు అని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నష్టం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నా రని గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. పవన్ కు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిలదీయాలని అన్నారు.
Recommended Video

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు
ఇదిలా ఉంటే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లోక్సభ, రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేశారని ఇప్పటికీ గట్టిగా నిలబడ్డారని పేర్కొన్నారు వైసీపీ నేతలు . ఇవేవీ పట్టని పవన్ కళ్యాణ్ తన బాస్ చంద్రబాబు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని ఇప్పటికే అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. ఇక మరోవైపు హోంమంత్రి సుచరిత కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పవన్ కళ్యాణ్ చెయ్యాల్సింది దీక్షలు కాదని, పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని ఒప్పించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ ఆ పని చేస్తే బాగుంటుందని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత హితవు పలికారు.












Click it and Unblock the Notifications