చంద్రబాబు ఫాదర్ ఆఫ్ కరప్షన్; విశాఖలో భూకబ్జాలన్నీ ఆయన కనుసన్నల్లోనే : గుడివాడ అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా రాజధానిగా జగన్ ప్రకటించిన విశాఖ నగరంలో భూముల కబ్జాల వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. టిడిపి నేతలు భూముల కబ్జాలకు పాల్పడుతున్నారు అని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆ భూములను స్వాధీనం చేసుకునే క్రమంలో దాడులు నిర్వహిస్తోంది. అయితే సీఎం జగన్ కావాలనే టిడిపి నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రశ్నించిన వారి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే భూముల కబ్జా ఆరోపణలు చేస్తున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు. దీనికి వైసిపి నేతలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.

చంద్రబాబు కనుసన్నల్లోనే విశాఖలో భూ కబ్జాలు
తాజాగా టిడిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పై వైయస్సార్ సిపి అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ఫాదర్ ఆఫ్ కరప్షన్ అంటూ అభివర్ణించారు. విశాఖలో భూ కబ్జాలన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. చంద్రబాబుకి తెలియకుండా టిడిపి నాయకులు కబ్జాలకు పాల్పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ భూములు కాపాడడం కోసం చిత్తశుద్ధితో పని చేస్తోందని,ఈ క్రమంలోనే కబ్జాలకు గురైన భూములను కాపాడే ప్రయత్నంలో ఉందని ఆయన పేర్కొన్నారు. టిడిపి నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతూ, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

విశాఖ నడిబొడ్డున ఉన్న భూముల్ని సైతం టీడీపీ నాయకులు వదల్లేదు
విశాఖలో జరిగిన భూకబ్జాలు ఎక్కువగా టిడిపి నాయకులు చేసినవేనని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు నాలుగు వేల కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. టిడిపి నేతలు విశాఖ నడిబొడ్డున ఉన్న భూములను సైతం వదిలిపెట్టకుండా ఆక్రమణలకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుచేసిన వారు ఎంతటి వారైనా సరే తప్పించుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు స్పందించాలని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications