దమ్ముంటే గుడివాడలో పోటీ చేయ్-చంద్రబాబుకు కొడాలి సవాల్-పవన్ ఎమ్మెల్యే కష్టాలపైనా..
గుడివాడ మల్లాయపాలెం లేఅవుట్ లో టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందజేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. గుడివాడ ప్రజల పాతికేళ్ల కల నెరవేర్చేందుకు వచ్చిన సీఎం జగన్ కు కొడాలి ధన్యవాదాలు తెలిపారు. 2004లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు చంద్రబాబు తొమ్మిదేళ్లుగా సీఎంగా ఉన్నారని నాని తెలిపారు. అప్పటికే 10 వేల మంది నిరుపేదలున్నట్లు తాను అప్పటి సీఎం వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు.
వైఎస్సార్ చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన సమయంలోనే తాను కూడా అక్కడికి వెళ్లి తాను ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా అపాయింట్ మెంట్ ఇచ్చి మాట్లాడారన్నారు. తాను అడిగిన 45 రోజుల్లో 77 ఎకరాల భూమిని పేదలకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారన్నారు. గుడివాడలో టిడ్కో ఇళ్ల నిర్మాణం జరిగిందంటే వైఎస్సార్ ఇచ్చిన భిక్షగా తాను భావిస్తున్నట్లు కొడాలి తెలిపారు. వైఎస్సార్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదన్నారు. అందుకే టిడ్కో లేఅవుట్ లో 18 అడుగుల వైఎస్సార్ విగ్రహం పెట్టించినట్లు వెల్లడించారు.

గుడివాడలో బంధువులు ఉన్నారని, అత్తారిల్లు ఇక్కడే ఉందని, సామాజిక వర్గం ఇక్కడే ఉందని చెప్పుకునే చంద్రబాబు.. టీడీపీ హయాంలో జాతీయ స్ధాయిలో చక్రం తిప్పినట్లు చెప్పుకుని ఏమీ చేయలేకపోయారన్నారు. గుడివాడలో రైల్వే ట్రాక్ లపై ఫ్లైఓవర్లు కూడా వేయించలేకపోయారని విమర్శించారు. కానీ జగన్ గడ్కరీకి చెప్పి ఆ ఫ్లైఓవర్లు వేయించారన్నారు. వైఎస్సార్ హయాంలో తాను ఆయన్ను కలిసి చేయించిన అభివృద్ధి పనుల్ని కొడాలి గుర్తుచేసుకున్నారు. వైఎస్ హయాంలో గుడివాడలో జరిగిన పనుల్ని కొడాలి వివరించారు.
వైఎస్ 250 ఎకరాల స్ధలాన్ని ఇళ్ల పట్టాలు, మంచినీటి పథకాల కోసం కొంటే, జగన్ తండ్రి కంటే రెండడుగులు ఎక్కువగా వేస్తానని హామీ ఇచ్చి గుడివాడతో పాటు రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్ధలాలతో పాటు ఇళ్లు కట్టించే కార్యక్రమం పెట్టారని కొడాలి ప్రశంసించారు. ఇందుకోసం 15 లక్షల కోట్లు ఖర్చుపెడుతున్నారని గుర్తుచేశారు. ఇలాంటి నేతలతో చంద్రబాబుకు పోలికా అని ప్రశ్నించారు. దమ్ముంటే, మగాడివైతే చంద్రబాబు గుడివాడ వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు. వచ్చే ఐదేళ్లు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా మీరే ఉంటారని జగన్ తెలిపారు. మీ దయవల్ల గుడివాడ ఎమ్మెల్యేగా కూడా తానే ఉంటానని, వచ్చే ఐదేళ్లలో రూ.750 కోట్లిస్తే 2029లో ఇక ఏమీ అడగనని కొడాలి తెలిపారు.

నేను అసెంబ్లీలో అడుగుపెడతానని, దమ్ముంటే ఆపాలని పవన్ కళ్యాణ్ జగన్ కు సవాళ్లు విసురుతున్నారని, ముఖ్యమంత్రి కావడానికి పార్టీ పెట్టిన పవన్.. ఇప్పుడు రెండు పార్టీల్ని కలుపుకుని కూడా అసెంబ్లీకి వెళ్లేందుకు కష్టపడుతున్నారని కొడాలి విమర్శించారు. ఆయనతో నటించిన హీరోయిన్లు కూడా ఎంపీలయ్యారని, కానీ స్టార్ అని చెప్పుకునే పవన్ ఎమ్మెల్యే కావడానికి ఇబ్బందులు పడుతున్నాడని గుర్తుచేశారు. జగన్ దెబ్బకు తట్టుకోలేక చంద్రబాబు, పవన్ కలిశారని, పవన్ కోరిక అసెంబ్లీలో అడుగుపెట్టడమని, చంద్రబాబు కోరిక ప్రతిపక్ష నేతగా ఉండటమే అన్నారు. వీరిద్దరికీ జగన్ ను సీఎం సీటు నుంచి కదిపే శక్తి వీరికే కాదని, దేశంలో ఎవరికీ లేదన్నారు. చచ్చేంతవరకూ మీతోనే ఉంటానని సీఎం జగన్ కు కొడాలి హామీ ఇచ్చారు.
ప్రతిపక్ష పార్టీలు కూడా టిడ్కో ఇళ్ల వద్దకు వచ్చి ఏదైనా లోపాలు కనిపిస్తాయేమోనని వీడియోలు తీసుకెళ్లాయని కొడాలి తెలిపారు.వైఎస్సార్ కొన్న స్ధలంలో ఆయన చనిపోయిన తర్వాత 2017 ఆఖరులో చంద్రబాబు మల్లాయపాలెంలో టిడ్కో ఇళ్లకు శంఖుస్ధాపన చేశారని, కేవలం 1200 ఇళ్లు మాత్రమే కట్టారన్నారు. లబ్దిదారుల దగ్గర రూ.25 కోట్లు వసూలు చేసి కేంద్రం డబ్బులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చి, తాను కట్టిన ఇళ్లను జగన్ ప్రారంభిస్తున్నారని సిగ్గులేకుండా చెప్తున్నారన్నారు. గతంలో జగన్ పాదయాత్ర సమయంలో సగం డబ్బులకే టిడ్కో ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకుంటూ ఇప్పుడు ఇళ్లు కట్టించి ఇస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications