డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి-అసెంబ్లీలో ఏకగ్రీవ ఎన్నిక
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో కోలగట్ల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో కోలగట్లను అధికార, ప్రతిపక్ష సభ్యులంతా అభినందనలు తెలిపారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘుపతి తాజాగా ఆ పదవి నుంచి తప్పుకోవడంతో ఆయన స్ధానంలో కోలగట్లకు అవకాశం లభించింది. అధికార పార్టీ నిర్ణయం మేరకు విజయనగరం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామిని డిప్యూటీ స్పీకర్ గా సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంది. అయితే విపక్ష టీడీపీ నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం తనను డిప్యూటీ స్పీకర్ స్ధానంలో కూర్చోబెట్టినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు బాధ్యతలు స్వీకరించాక కోలగట్ల తెలిపారు. టీవీలు, ఇతర మాధ్యమాల ద్వారా సభా కార్యక్రమాలను ప్రజలు గమనిస్తుంటారని, సభ పట్ల, సభ్యుల పట్ల గౌరవం పెంపొందించుకునే విధంగా అందరూ పనిచేయాలని కోలగట్ల కోరారు. సభలో చర్చలు అర్ధవంతంగా సాగేందుకు సభ్యులు సహకరించాలని, సభ్యులు వివిధ అంశాలపై పూర్తి అవగాహనతో రావాలని కూడా కోలగట్ల సూచించారు. తమను ఎన్నుకున్న ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా చట్టసభల్ని వాడుకునేందుకు అందరూ కృషి చేయాలన్నారు.
డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామిని కూర్చోబెట్టడం సంతోషంగా ఉందని సీఎం జగన్ తెలిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేయడం, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. కోలగట్ల కంటే ముందు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘుపతి సేవల్ని కూడా సీఎం జగన్ ప్రశంసించారు. డిప్యూటీ స్పీకర్ గా చట్టసభలో అందరికీ మంచి చేయాలని ఆశిస్తున్నట్లు జగన్ తెలిపారు.