రఘురామపై వరుసగా ఎమ్మెల్యేల ఫిర్యాదులు- పొమ్మనలేక పొగ ? రెబెల్ ఎంపీ లొంగేనా ?
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీనే ధిక్కరిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై జగన్ పార్టీ వ్యూహం మార్చింది. మూడు రోజులుగా ఎమ్మెల్యేలు, మంత్రి ఆయనపై వరుసగా పోలీసులకు ఫిర్యాదులు చేయడం చూస్తుంటే వైసీపీ మరో స్కెచ్ రెడీ చేస్తున్నట్లే కనిపిస్తోంది. అధికార పార్టీతో యుద్ధం చేయడం ఎలా ఉంటుందో రఘురామకృష్ణంరాజుకు కూడా మెల్లగా అర్ధమవుతున్నట్లే తాజా పరిస్ధితులు స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తనపై వరుసగా ఫిర్యాదులు చేస్తున్నా రఘురామరాజు మాత్రం ఎక్కడా నోరు మెదపడం లేదు.
కొనసాగుతున్న ఫిర్యాదులు...
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ప్రారంభించిన ఎమ్మెల్యేల ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. తొలుత మంత్రి, ఆచంట ఎమ్మెల్యే రంగనాథరాజు ఫిర్యాదు చేయగా.. ఆ తర్వాత భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు, అనంతరం తాజాగా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు కూడా దాదాపు ఒకే రకమైన కారణాలతో పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారుల సూచనతో ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు వ్యతిరకంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన కామెంట్స్, ఆయన చర్యలపై ఆధారాలు సేకరిస్తున్నారు.
పొమ్మనలేక పొగబెడుతున్నారా ?
తమ పార్టీ తరఫున గెలిచి, తమనే ధిక్కరిస్తున్న ఎంపీ రఘురామ విషయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన వైసీపీ.... ఆ వ్యవహారం తేలేందుకు ఆలస్యమవుతుందని అంచనా వేస్తోంది. దీంతో ఆ లోపు ఆయన్ను సొంత నియోజకవర్గంలోనే ఉక్కిరిబిక్కిరి చేయాలని, అప్పటికీ లొంగకపోతే అవసరమైతే అరెస్టు వరకూ వెళ్లాలని భావిస్తోంది. అంతిమంగా పార్టీ నుంచి తనంతట తానుగానే బయటికి వెళ్లేలా రఘురామపై ఒత్తిడి పెంచాలని వైసీపీ కోరుకుంటోంది. అందుకు తగినట్లుగానే రోజుకో ఎమ్మెల్యేతో ఆయనపై ఫిర్యాదులు చేయిస్తోంది. ఫిర్యాదుల పర్వం పూర్తయ్యాక చర్యల పర్వం ప్రారంభం కానుంది. ఈ ఫిర్యాదులను ఒక్కొక్కటిగా లేదా అన్నీ కలిపి సిట్ దర్యాప్తు తరహాలోనే విచారణకు ఆదేశించే అవకాశాలూ లేకపోలేదు. అప్పుడు రోజూ విచారణకు హాజరయ్యేలా రఘురామపై ఒత్తిడి పెంచేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్లు అర్ధమవుతోంది.
Recommended Video
రఘురామ లొంగుతారా?
వైసీపీ వరుసగా ఎమ్మెల్యేలతో పోలీసులకు ఫిర్యాదులు చేయిస్తున్నా ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం ఎక్కడా స్పందించడం లేదు. గతంలో ఎమ్మెల్యేల వ్యాఖ్యలను అప్పటికప్పుడే ప్రెస్ మీట్లు పెట్టి ఖండించిన రఘురామ.. ఇప్పుడు మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. వైసీపీ ట్రాప్ లో పడితే తాను ఇరుక్కోవడం ఖాయమని, ఫిర్యాదులు, కేసులపై స్పందిస్తే ఇదే అదనుగా వైసీపీ ఇరికిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. దీంతో ఫిర్యాదులపై ఎక్కడా నోరు మెదపకుండా జాగ్రత్త పడుతున్నారు. ఓసారి ఎమ్మెల్యేల ఫిర్యాదుల పర్వం పూర్తయితే అన్నింటిమీదా ఒకేసారి స్పందిస్తే సరిపోతుందని కూడా రఘురామ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా వైసీపీకి అవకాశం ఇవ్వకుండా ఉండాలనేది ఆయన వ్యూహం.