టీడీపీ ఎంపీలతో కలిసి పోరు! పార్లమెంట్లో వైసీపీ ఎంపీ సంచలన ప్రకటన..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విపక్ష వైసీపీకి, అధికార పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు మధ్య సాగుతున్న పోరు నిత్యం చూస్తూనే ఉన్నాం. వైసీపీ వర్సెస్ కూటమిగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో ఇవాళ ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది.
పార్లమెంట్ సాక్షిగా ఓ వైసీపీ ఎంపీ, మాజీ ఫ్లోర్ లీడర్ కూడా అయిన పీవీ మిథున్ రెడ్డి.. టీడీపీ ఎంపీలతో కలిసి ఓ కీలక అంశంపై పోరాడేందుకు సిద్దమని పార్లమెంట్ లోనే తేల్చిచెప్పేశారు.

ఇవాళ లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ సీపీ తరఫున చర్చలో మాట్లాడిన ఎంపీ మిథున్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించవద్దంటూ కేంద్రాన్ని వేడుకున్నారు. ఒరిజినల్గా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 194 టీఎంసీలు అని, ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ చేశారని గుర్తుచేశారు. ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేది దీని ఉద్దేశం అన్నారు.
కానీ 41.15 మీటర్లకు ప్రాజెక్టును తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారని మిథున్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. దీనివల్ల పోలవరం కెపాసిటీ 194 నుంచి 115 టీఎంసీలకు పడిపోతుందన్నారు. ఇది రైతులకు, రాష్ట్రానికి తీరని అన్యాయం అన్నారు. ఈ అన్యాయం ఎదిరించేందుకు టిడిపి ఎంపీలతో కలిసి పోరాటానికి సిద్ధం అని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరన్నారు. 115 టీఎంసీలకు పోలవరాన్ని తగ్గించడం వల్ల కేవలం 3.2 లక్షల ఎకరాలకి నీరు అందుతుందన్నారు.
ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ఇప్పుడు పోలవరం కెపాసిటీని తగ్గించారని మిథున్ రెడ్డి కేంద్రంపై విరుచుకుపడ్డారు. విభజన చట్టం మేరకు ఒరిజినల్ గా ఉన్న పోలవరం సామర్ధ్యాన్ని కొనసాగించాలని కోరారు. కెపాసిటీ తగ్గించిన తర్వాత బనకచర్ల కు నీరు ఎలా అందుతుందని ప్రశ్నించారు. రాయలసీమకు నీరేలా ఇస్తారని అడిగారు.
మరోైవైపు ఏపీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం మెల్లగా రద్దు చేస్తున్నారని, ఇంగ్లీష్ చదివితేనే విదేశాల్లో కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉందని మిథున్ రెడ్డి తెలిపారు. ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు కొనసాగించాలన్నారు.
ఆర్బీఐ నిబంధనల విరుద్ధంగా మార్గదర్శి 2600 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని, ప్రజల డబ్బును ఇతర కంపెనీలకు మళ్ళించారని మిథున్ ఆరోపించారు. సహారా శారద కుంభకోణం కంటే మార్గదర్శి కుంభకోణం పెద్దదన్నారు. మార్గదర్శిపై 1000 కోట్ల రూపాయల జరిమానా విధించారని గుర్తుచేశారు. మార్గదర్శి కుంభకోణం పై దర్యాప్తు జరపాలని కోరారు. డిపాజిటర్ల డబ్బు తిరిగి చెల్లించకుండా వాటిని రెన్యువల్ చేస్తున్నారన్నారు. ఈ అంశంపై ప్రధాని జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దని, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జిందాల్ గ్రూపును పిలిచి మాట్లాడాలని కూడా కేంద్రాన్ని మిథున్ రెడ్డి కోరారు. విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని, వీటి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications