సస్పెన్షన్ కోసం ఆయన - రాజీనామా కోసం వీళ్లు - వైసీపీలో చిచ్చురేపుతున్న ఎంపీ వ్యవహారం...
ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న వైసీపీ ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో అసమ్మతి పోరు కూడా ఒకటి. పార్టీ నేతల్లో కొందరు అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ బయటపడేందుకు సాహసించడం లేదు. కానీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం అలా కాదు. పార్టీపై అసంతృప్తిని రోజురోజుకీ బహిరంగంగా వెళ్లగక్కేస్తున్నారు. దీంతో ఆయనపై పార్టీ కూడా ఎదురుదాడి వ్యూహాన్నే ఎంచుకుంది. అయితే ఇది ఎంతవరకూ వెళతుందనేది తెలియడం లేదు.
రఘురాముడి చిచ్చు....
పదేళ్ల పోరాటం తర్వాత అధికారం చేజిక్కించుకున్న వైసీపీలో అంతర్గతంగా అక్కడక్కడా అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వినిపిస్తున్న అసమ్మతి అన్నింటికంటే ప్రత్యేకమైనది. పార్టీలో ఉంటూనే అధిష్టానంపై, పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలపై ఆయన చేస్తున్న విపరీత వ్యాఖ్యలు అధిష్టానానికి మంటపుట్టిస్తున్నాయి. నిన్న ఈ వ్యవహారం కాస్తా రాజీనామా సవాళ్ల వరకూ వెళ్లింది. పార్టీపై ఇష్టం లేకపోతే రాజీనామా చేసి గెలవాలని ఎమ్మెల్యేలు చేసిన సవాల్ కు స్పందించిన రఘురామకృష్ణంరాజు... మీరు కూడా చేయండి అప్పుడు చూసుకుందామంటూ ప్రతి సవాల్ విసిరారు..
ఎంపీపై వైసీపీ వైఖరేంటి ?
పార్టీ టికెట్ పై గెలిచి ఏకంగా అధినేతపైనే విమర్శలకు దిగుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ వేచిచూసే ధోరణి అనుసరిస్తోంది. ఆయన ఎంతవరకూ వెళతారో చూద్దామని అధినేత జగన్ పార్టీ నేతలతో తాజాగా వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే పార్టీపై విమర్శల తీవ్రత పెంచి చివరికి పార్టీలో ఇమడలేక రాజీనామా చేస్తారని, అప్పుడు నేరుగా ఉప ఎన్నికకే వెళ్లొచ్చనేది వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను పట్టించుకోనక్కరలేదని వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. అదే సమయంలో ఎంపీ చేస్తున్న విమర్శలపై స్పందించకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నందున కౌంటర్లు ఇవ్వాలనేది వైసీపీ వ్యూహంగా ఉంది. అంతే తప్ప షోకాజ్ నోటీసుల జోలికి వెళ్లరాదనే భావన వైసీపీలో కనిపిస్తోంది.
Recommended Video
సస్పెన్షన్ కోసం ఎదురుచూపులు...
ఏడాదిగా వైసీపీ అధినేతపై కానీ, పార్టీపై కానీ నేరుగా విమర్శలు చేయకుండా తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్న రఘురామకృష్ణంరాజు.. చివరికి పార్టీయే తనను సస్పెండ్ చేస్తుందని ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన మాటలు, విమర్శలను బట్టి చూసినా వైసీపీ అధిష్టానమే తనను బయటికి పంపాలి తప్ప తాను రాజీనామా చేసే అవకాశం లేదనే సంకేతాలే కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ అధిష్టానం తనపై చర్యలు తీసుకోక తప్పని స్ధాయికి విమర్శలను తీసుకెళ్లాలని రఘురామకృష్ణంరాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది.