రఘురామ బెయిల్పైనా ? పరారీలోనా ? సర్కార్ మెడకు పూచీకత్తు- వైసీపీ లాయర్ లేఖతో
ఏపీ సీఐడీ గతంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై నమోదు చేసిన రాజద్రోహం కేసులో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. అయితే బెయిల్ నిబంధనలు పూర్తి చేయకుండానే ఆయన్ను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వ్యవహారం ఇప్పుడు ఏపీ సర్కార్ మెడకు చుట్టుకోబోతోంది. రఘురామను బెయిల్ నిబంధనల మేరకు విడుదల చేయాల్సిన గుంటూరు జైలు అధికారులు మౌనంగా ఉండిపోవడంతో ఇప్పుడు సీఐడీ కోర్టుతో పాటు సుప్రీంకోర్టులో ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్ధితి ఎదురు కానుంది.
రఘురామ బెయిల్పైనా ? పరారీలోనా ?
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం బెయిల్పై ఉన్నారా లేక పరారీలో ఉన్నారా అనే కొత్త అనుమానాల్ని వైసీపీ ఇవాళ తెరపైకి తెచ్చింది. గత నెలలో సుప్రీంకోర్టు ఆదేశాలతో బెయిల్ షరతులు పూర్తి చేసి విడుదల కావాల్సిన రఘురామరాజు సొంత పూచీ కత్తు సమర్పించకుండానే సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా విడుదలై ఢిల్లీ వెళ్లిపోవడంతో ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన సొంత పూచీకత్తు సమర్పించిన తర్వాత గుంటూరు జైలు అధికారులు ఆయన్ను విడుదల చేయాల్సి ఉండగా.. అదేమీ లేకుండానే ఆయన విడుదలై ఢిల్లీ వెళ్లిపోయారు.
గుంటూరు జైలు అధికారుల తప్పిదం
రాజద్రోహం కేసులో రఘురామరాజు సొంత పూచీకత్తుతో పాటు మరో ఇద్దరిని ష్యూరిటీలు ఇచ్చిన తర్వాతే ఆయన్ను విడుదల చేయాల్సి ఉంది. కానీ సీఐడీ కోర్టులో ఆయన తరఫున ఇద్దరు ష్యూరిటీలు సమర్పించారు. దీంతో జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి వెళ్లిన రఘురామరాజు తిరిగి జైలు అధికారులకు ష్యూరిటీ సమర్పించి విడుదల కావాల్సి ఉంది. కానీ ఆయన నేరుగా సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నంచి నేరుగా డిశ్చార్జ్ అయి ఢిల్లీ వెళ్లిపోయారు. దీంతో గుంటూరు సీఐడీ కోర్టు జైలు అధికారులకు రఘురామ సంతకాల కోసం పంపిన బెయిల్ పేపర్లు మళ్లీ తిరిగొచ్చాయి.
రిమాండ్ పొడిగిస్తున్న సీఐడీ కోర్టు
గుంటూరు జైలు అధికారులకు పంపిన బెయిల్ పేపర్లపై రఘురామ సంతకాలు తీసుకోవడంలో జైలు సూపరింటెండెంట్ విపలం కావడంతో అవి కాస్తా తిరిగి సీఐడీ కోర్టుకు చేరాయి. దీంతో బెయిల్కు బదులుగా రఘరామకు సీఐడీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాల్సిన పరిస్ధితులు ఎదురవుతున్నాయి. గతంలో ఇలా పొడిగించిన రిమాండ్ ఇవాళ్టితో ముగియడంతో తాజాగా మరోసారి సీఐడీ కోర్టు రఘురామ రిమాండ్పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
వైసీపీ ఫిర్యాదుతో ఇరుకునపడ్డ సర్కార్
వైసీపీ లీగల్సెల్ న్యాయవాది కోటంరాజు వెంకటేష్ శర్మ తాజాగా సుప్రీంకోర్టు, హైకోర్టుతో పాటు ప్రధాని, రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్కు రఘురామరాజు పరారీలో ఉన్నట్లు లేఖలు రాశారు. ఆయన్ను అరెస్టు చేయాల్సిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు స్పందిస్తే వైసీపీ సర్కార్ ఇరుకునపడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వ పరిధిలో ఉండే జైళ్ల శాఖ నిర్వాకంతో రఘురామ బెయిల్ షరతులు పూర్తి చేయకుండానే విడుదలైన వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమవుతోంది.