ప్రత్యేక హోదాకు వైసీపీ పట్టు- రాజ్యసభలో సాయిరెడ్డి నోటీసు-రూల్ 267 కింద చర్చకు
ఏపీ విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ఇవాళ వైసీపీ మరోసారి పార్లమెంటులో తెరపైకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్కు నోటీసు ఇచ్చారు.
పార్లమెంటులోని సభా నియమ నిబంధనలలో ఉన్న రూల్ 267 కింద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేక హోదాపై చర్చ కోరుతూ ఈ నోటీసును ఇచ్చారు. రాజ్యసభలో ఇవాళ నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్ 267 కింద ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చ కోరిన విజయసాయిరెడ్డి ఈ అంశం ఎందుకు అత్యంత ప్రధాన్యతతో కూడుకున్నదో తన నోటీసులో వివరించారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్కు పలు హామీలను ప్రకటించారని, అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అతి ప్రధానమైనదని సాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఇచ్చిన హామీని మార్చి 1, 2014లో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం చర్చించి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆమోదించిందని సాయిరెడ్డి గుర్తుచేశారు.. కానీ ఇది జరిగి ఏడేళ్ళు కావస్తున్నా కేంద్ర కేబినెట్ ఈ హామీని నెరవేర్చలేదని సాయిరెడ్డి తెలిపారు.. కాబట్టి ఈరోజు సభా కార్యక్రమాలన్నింటినీ సస్పెండ్ చేసి సభలో తక్షమే ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్కు నోటీసులో విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications