విగ్గురాజాకు హవాలా డబ్బు ? ఢిల్లీ చెట్లు కింద సర్వేలు అందుకే ! సాయిరెడ్డి సెటైర్లు
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఇరు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ.. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విడుదల చేసిన సర్వే చర్చనీయాంశమైంది. ఈ సర్వేపై ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు విపక్ష టీడీపీ కూడా అంతర్గతంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ గెలుస్తోందంటూ సర్వే విడుదల చేసిన రఘురామపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు.
ప్రభుత్వ బ్యాంకుల్లో అమాయక డిపాజిటర్లను నిలువునా ముంచాక, ఇప్పుడు రఘురామ మాయలమారి రాజకీయ పండితుడి అవతారం ఎత్తాడని విజయసాయిరెడ్డి విమర్శించారు. పనీపాటా లేకపోవడంతో అతడి మానసిక ఆరోగ్యం గాడితప్పిందని, అందుకే ఢిల్లీలో కూర్చుని ఏపీ ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తున్నాడని ఎద్దేవా చేశారు. రఘురామను తలకిందులుగా వేళ్లాడదీసి ప్రభుత్వ బ్యాంకులకు అతడు బకాయిపడిన రూ.1000 కోట్లను కక్కించాలని సీబీఐని కోరుతున్నట్టు విజయసాయి ట్వీట్ చేశారు
విగ్గురాజుకు వారంలో ఒకటి రెండుసార్లు హవాలా ద్వారా డబ్బు ముడుతుందని, దాంతో పాటే యాక్షన్ సీన్లతో కూడిన స్క్రిప్ట్ కూడా అందుతుందని సాయిరెడ్డి ఆరోపించారు. సీరియస్ సబ్జెక్టు అయితే ఎక్కువ అడుగుతున్నాడట అన్నారు. అప్పట్లో పచ్చ పార్టీ ఆఫీసు నుంచి స్క్రిప్టు వెళ్లేదని, ఇప్పుడు కుల మీడియానే అంతా చూసుకుంటోందన్నారు.పచ్చ కుల మీడియాను పక్కన పెట్టుకొని ఊరికే ఢిల్లీలో చెట్టు కింద కూర్చొని లోకాభిరాయణం చెప్పడం కాదు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందంటూ సర్వేలు చేసినవాళ్లు తన ఎంపీ/ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పోటీకి దిగొచ్చని సాయిరెడ్డి సవాల్ విసిరారు.