చంద్రబాబును ఆడేసుకుంటున్న సాయిరెడ్డి- బాయ్కాట్పై- జెండా పీకేసే ముందు..
ఏపీలో పాత నోటిఫికేషన్ ప్రకారమే నిర్వహిస్తున్నారన్న కారణంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బాయ్కాట్ చేయాలన్న విపక్ష టీడీపీ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీ వంటి పార్టీ ఇలా తొలిసారి ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్రంలో చర్చ సాగుతోంది. అదే సమయంలో ఇదే అదనుగా వైసీపీ నేతలు టీడీపీ నిర్ణయంపై విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్ను టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్లు పెట్టారు.
పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని వెక్కిరించేలా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో టీడీపీ ఇక జెండా పీకేయడమే మిగిలుందనేలా సాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జెండా పీకేసే ముందు పరిణామాలు అంటూ సాయిరెడ్డి ఇందులో నాలుగు అంశాలను పేర్కొన్నారు. ఇందులో వరుస ఓటములతో నాయకత్వంపై కేడర్కు నమ్మకం పోతుంది, శ్రేణులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటాయి, పోటీకి అభ్యర్ధులు దొరకరు, ఏవో సాకులు చూపుతూ ఎలక్షన్లకు దూరంగా ఉంటామని నాయకత్వం ప్రకటిస్తుంది, ఖేల్ ఖతం దుకాణం బంద్ అంటూ సాయిరెడ్డి ట్వీట్లో రెచ్చిపోయారు.
మరో ట్వీట్లో చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారా లేదా ప్రజలే చంద్రబాబును బహిష్కరించారా అంటూ మరో ట్వీట్లో సాయిరెడ్డి ప్రశ్నించారు. లోకల్ బాడీలు చంద్రబాబును భయపెడుతున్నాయా.. లేక లోకేష్ బాడీ లాంగ్వేజ్ చంద్రబాబు భయపెడుతోందా ? అంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే వైసీపీ నేతలంతా టీడీపీ పరిషత్ ఎన్నికల బహిష్కరణపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ట్వీట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.