టీడీపీ మరో 40ఏళ్లు ప్రతిపక్షంలోనే; తుప్పు- పప్పు.. మీకా దమ్ముందా? ఏకిపారేసిన సాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును మరోమారు టార్గెట్ చేశారు. ఇటీవల కాలంలో మళ్ళీ నిత్యం చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేస్తున్న సాయిరెడ్డి టీడీపీ వ్యవస్థాపక దినోత్సవంపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 40 వసంతాల టిడిపి ప్రస్థానం లోగోను ఆవిష్కరించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాడు ఎన్టీఆర్ స్థాపించిన ఉద్దేశాన్ని వెల్లడించి, టిడిపి 40 సంవత్సరాల ప్రస్థానం సందర్భంగా ఘనంగా వేడుకలు చేయాలని నిర్ణయించారు.

40 ఏళ్లు పూర్తి చేసుకున్న టీడీపీ మరో 40 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నా: సాయిరెడ్డి
దీనిపై తెలుగుదేశం పార్టీని, టీడీపీ అధినేత చంద్రబాబును ఘాటుగా విమర్శించారు విజయసాయిరెడ్డి. 40 ఏళ్లు పూర్తి చేసుకున్న టీడీపీ మరో 40 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నా అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. అయితే తుప్పు- పప్పు నాయుళ్లు మాత్రం అర్థశతకం కొట్టేదాకా కూడా బతకనిచ్చేలా లేరు అని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికలే ఆఖరి పోరాటం...ఆపై అస్త్ర సన్యాసం అనేలా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ పరిస్థితులు అని విజయ్ సాయి రెడ్డి పేర్కొన్నారు.
టీడీపీ విజయోత్సవాలు నిర్వహిస్తారట టీడీపీని పాతరేసిన చంద్రబాబు: వైసీపీ ఎంపీ
ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో విజయోత్సవాలు నిర్వహిస్తారట టీడీపీని పాతరేసిన చంద్రబాబు! అని పేర్కొన్న విజయసాయిరెడ్డి పార్టీస్థాపించన చోట ఒక్క ఎమ్మెల్యే, కార్పోరేటర్ ఎందుకు గెలవలేక పోయారు? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికాకే కదా తెలంగాణాలో జెండా పీకేసింది! అంటూ చంద్రబాబును విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో టీడీపీ వ్యవస్థాపక దినం నాడైనా చంద్రబాబు ఎన్టీఆర్ కు చేసిన 'నమ్మక ద్రోహం'పై పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

చంద్రబాబుకు సాయిరెడ్డి సవాల్ ... జవాబు చెప్పే దమ్ముందా ?
2 రూపాయల కిలో బియ్యం రద్దుపైనా, లిక్కర్ కంపెనీలు విదిలించిన 2 వేల కోట్లకు కక్కుర్తిపడి నిషేధం ఎత్తేయడంపైన జవాబు చెప్పే దమ్ముందా ! చంద్రబాబూ.. అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యంపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలని పేర్కొన్న విజయసాయిరెడ్డి చంద్రబాబు చెప్పే అబద్ధాలను లై డిటెక్టర్లు కూడా పసిగట్టలేవు అంటూ వ్యాఖ్యానించారు.

నిజాలు తప్ప ఇంకేవీ తెలియవన్నట్టుగా ఉంటాయి దళారి మాటలు: సాయిరెడ్డి
నంగినంగిగా, నిజాలు తప్ప ఇంకేవీ తెలియవన్నట్టుగా ఉంటాయి దళారి మాటలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 240 లిక్కర్ బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చింది ఈయనే అని అసెంబ్లీ సాక్షిగా జగన్ ఆధారాలు చూపారు అని పేర్కొన్నారు. అయినా పాడిన పాటే పాడుతున్నారు చంద్రబాబు అండ్ బ్యాచ్ అంటూ విజయ సాయి రెడ్డి తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications