ఏపీ సమస్యలపై అమిత్ షాతో భేటీ అయిన వైసీపీ ఎంపీలు... ఆ అంశాలపై ఏపీకి సహకరించాలని వినతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి, లోక్ సభా పక్ష నాయకుడు మిథున్ రెడ్డి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన తోడ్పాటుపై అమిత్ షా కు వివరించారు.

ఏపీ సమస్యలపై అమిత్ షా కు మెమొరాండం
ఆయా అంశాలపై విపులంగా అమిత్ షా కు మెమోరాండం అందించిన వైసీపీ ఎంపీలు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల వ్యయానికి ఆమోదం తెలపాలని హోంమంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేయడం కోసం కేంద్రం నుండి సహకారం అందించాలని వారు అమిత్ షా ను కోరారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను, కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలను ప్రస్తావించారు. ఇటీవల చోటు చేసుకున్న వరద పరిస్థితులను, వరదల వల్ల కలిగిన తీవ్ర నష్టాన్ని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి కేంద్రం మొదట సహాయం అందించాలని కోరారు.

విభజన హామీలపై హోం మంత్రితో చర్చించిన వైసీపీ ఎంపీలు
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలపై హోంమంత్రితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అమిత్ షా కు విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడం కోసం కూడా ఆయన అమిత్ షాతో మాట్లాడినట్టు సమాచారం . ఆహార భద్రతా చట్టం ద్వారా ఏపీకి అన్యాయం జరుగుతోందని , ఆహార భద్రత చట్టం పై అనేక విషయాలను పార్లమెంటు ఉభయ సభల్లోనూ లేవనెత్తుతామని స్పష్టం చేసిన వైసీపీ ఎంపీలు దీనిపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు.

ఏపీ వరద బాధితుల సహాయం కోసం విజ్ఞప్తి చేసిన వైసీపీ ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరదల కారణంగా అతలాకుతలమైంది అని, వరద బాధితులకు తాత్కాలికంగా వెయ్యి కోట్ల రూపాయల సహాయం కావాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారని, ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారని తక్షణం సాయం విషయంలో స్పందించాలని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోకూడా కేంద్రం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇక కేంద్ర హోం శాఖ మంత్రి తో తాము భేటీ అయినట్టు రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై అమిత్ షా కు వినతి పత్రం అందించినట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

పంటల మద్దతు ధర విషయంలో పటిష్టమైన చట్టం కోసం విజ్ఞప్తి
ఇదే సమయంలో పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్దత కల్పించే అంశంపై భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపి ఆ మేరకు పటిష్టమైన చట్టం రూపకల్పన చేసేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications