లోకసభలో టీడీపీ కంటే వైసీపీ ఓ అడుగు ముందు! నోటీసు, సభ వాయిదా, మోడీ అలా చేశారా అని బాబు
Recommended Video

అమరావతి/న్యూఢిల్లీ: బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని పార్లమెంటు వేదికగా పోరాడాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు కార్యాచరణ చేపట్టింది. విభజన హామీలు నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఎంపీలు తోట నర్సింహం, కేశినేని నాని, నిమ్మల కిష్టప్పలు లోకసభలో సభాపతి సుమిత్రా మహాజన్కు నోటీసులు ఇచ్చారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా నోటీసులు ఇఛ్చింది. వైసీపీ మరో అడుగు ముందుకు వేసి ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంపీలు నోటీసులు అందించారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ 184వ నిబంధన కింద ఈ నోటీసులు ఇచ్చారు. లోకసభ, రాజ్యసభ ప్రారంభమయ్యాక వైసీపీ, టీడీపీ ఎంపీలు సభలో నిరసన తెలిపారు. ఇతర విపక్షాలు కూడా పలు అంశాలపై నిరసన తెలిపాయి. లోకసభ రేపటికి, రాజ్యసభ రెండు గంటలకు వాయిదా పడింది.

ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్
మరోవైపు, తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులను కలవాలని సూచించారు. విభజన హామీలపై చర్యలు చేపట్టేలా వారిని కోరాలని చెప్పారు. ఆదివారం ఎంపీలతో భేటీ అయిన సమయంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మోడీ చేస్తానని చెప్పారు కానీ
ఏపీకి రావలసిన ప్రయోజనాలు సాధించుకోవడమే అజెండాగా ఈ నాలుగేళ్లలో తాను 28 సార్లు ఢిల్లీకి వెళ్లానని, ప్రధాని మోడీతో సహా పలువురు మంత్రులను కలిసి పదేపదే విన్నవించినా ఫలితం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. బడ్జెట్కు ముందే మరోసారి ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిశానని, వినతిపత్రం అందించానని, పరిశీలిస్తామని చెప్పారని, ఇంతచేసిన బడ్జెట్లో ఏపీ ప్రస్తావన లేకపోతే ప్రజలు ఎలా భావిస్తారన్నారు. మన వాళ్లకు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే అలవాటులేదు గానీ చాలా సున్నిత మనస్కులు అని, అన్యాయం జరిగిందన్న భావన వాళ్ల మనస్సుల్లో నాటుకుపోయిందని, వారి ఆగ్రహానికి 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కూకటివేళ్లతో పెకిలించుకుపోయిందన్నారు.

అమిత్ షా ఫోన్ చేయలేదు
ఎంపీలతో భేటీ సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా.. చంద్రబాబుకు ఫోన్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. వీటిని చంద్రబాబు ఖండించారు. అమిత్ షా ఫోన్ చేయలేదన్నారు. శివసేన అధ్యక్షుసలు ఉద్ధవ్ థాకరేతో తాను మంతనాలు సాగించినట్టుగా ఒక పత్రికలో వచ్చిన కథనాన్నీ ఆయన ఖండించారు. తాను ఆయనతో మాట్లాడలేదన్నారు.

మోడీ అలా చేశారా.. చంద్రబాబు నిలదీత
కేంద్రం సహకారంతో చేపడుతున్న పథకాల ప్రచార చిత్రాలపై ప్రధాని మోడీ ఫోటో వేయడం లేదని ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను చంద్రబాబు ఖండించారు. తమ స్థాయికి అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర నాయకులు ఫిర్యాదు చేసినా నిజానిజాలను కేంద్ర నాయకులు అర్థం చేసుకోవాలన్నారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా అప్పట్లో ఎన్ని పథకాలకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఫొటోలు వేశారని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని, వాటిని తిప్పికొట్టాలన్నారు.












Click it and Unblock the Notifications