Kondapalli Municipality : వైసీపీ రగడ-ఛైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా-హైకోర్టు సీరియస్
ఏపీలో తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీకి చుక్కెదురైన స్ధానాల్లో కొండపల్లి నగర పంచాయతీ కూడా ఒకటి. ఇందులో ఉన్న 29 స్ధానాల్లో వైసీపీ, టీడీపీ చెరో 14 స్ధానాలు గెల్చుకోగా.. ఇండిపెండెంట్ శ్రీలక్ష్మి మరో స్ధానంలో విజయం సాధించారు. తర్వాత ఆమె టీడీపీ శిబిరంలో చేరారు. దీంతో టీడీపీ బలం 15కు చేరింది. కో ఆప్షన్ సభ్యుడిగా విజయవాడ ఎంపీ కేశినేని నానికి హైకోర్టు అవకాశం కల్పించడంతో టీడీపీ బలం 16కు చేరింది. దీంతో వైసీపీ ఛైర్మన్ పదవిపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్దితి. ఇక్కడే వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు.
నిన్న జరగాల్సిన కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్లో ఎన్నిక జరగకుండా రసాభాస చేశారు. టేబుళ్లు పడేసి, పేపర్లు చించేసి రసాభాస సృష్టించారు. దీంతో నిన్న జరగాల్సిన ఎన్నిక కాస్తా ఇవాళ్టికి వాయిదా పడింది ఇవాళ కూడా అదే పరిస్ధితి. అదనంగా వైసీపీ మంత్రులు, ఎంపీలు కూడా ఇబ్రహీంపట్నంలో మోహరించారు. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వీరి సూచనలతో వైసీపీ కౌన్సిలర్లు ఇవాళ కూడా రెచ్చిపోయారు. రసాభాస సృష్టించి కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. దీంతో ఎన్నిక మరోసారి వాయిదా పడినట్లయింది.
వైసీపీ రగడతో ఇవాళ జరగాల్సిన కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్ని నిరవధిగా వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారిగా ఉన్న మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు. అప్పటికే టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుపుతున్న హైకోర్టు ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోరం ఉండగా ఎన్నికను వాయిదా వేయాల్సిన అవసరం ఏమొచ్చని ప్రశ్నించింది. కొండపల్లి మువ్సిపల్ కమిషనర్, వీజయవాడ పోలీసు కమిషనర్ హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. దీంతో కాసేపట్లో దీనిపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వబోతోంది.