జగన్ అసెంబ్లీని త్వరలో రద్దు చేయబోతున్నారు- వైసీపీ రెబెల్ ఎంపీ
న్యూఢిల్లీ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలతో సహా పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశ రాజధానిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టుకు జారీ చేసిన ఆదేశాలపైనా స్పందించారు.
ఆగస్టు నాటికి..
రాష్ట్రంలో మరో ఏడెనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయని, అందులో ఒకటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఉందని ఆయన చెప్పారు.
90 రోజుల్లోగా ఛార్జ్ షీట్ ను దాఖలు చేయనివ్వకుండా కొందరు వ్యక్తులు అడ్డు పడొచ్చని, ఓ ఎమ్మెల్సీ విషయంలో ఇదే జరిగిందని గుర్తు చేశారు. 90 రోజుల్లో ఛార్జ్ షీట్ ను దాఖలు చేయకపోవడం వల్ల ఆ ఎమ్మెల్సీకి బెయిల్ వచ్చిందని అన్నారు.
బడ్జెట్ సమావేశాల తరువాత..
ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల తరువాత మార్చి-ఏప్రిల్ లల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయబోతోన్నారని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. జులై-ఆగస్టు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే సమాచారం ఉందని పేర్కొన్నారు. ఒక్క రోజు కూడా తమకు వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకోకుండా జగన్ ప్రభుత్వం అయిదేళ్ల పాటు అధికారంలో ఉండొచ్చని కూడా కొందరు చెబుతున్నారని వ్యాఖ్యానించారాయన.
ముందస్తుకు వెళ్తేనే..
ఇప్పుడున్న అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్తేనే గెలిచే అవకాశం ఉందని, లేకపోతే ఓడిపోతుందని సమాచారం కూడా ఉందని రఘురామ చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లడం వల్ల ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకుని బలపడతాయని, రకరకాలుగా, ఎవరి ఊహకు తగ్గట్టుగా వారు చెబుతున్నారనీ అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే తాను కూడా భావిస్తున్నానని రఘురామ పేర్కొన్నారు.
వివేకా హత్యకేసు తేలే లోపే
వైఎస్ వివేకా హత్యకేసులో తన సొంత పార్టీకి చెందిన నాయకుల పేర్లు ఉన్నాయని, వారందరూ ఆందోళన చెందుతున్నారని రఘురామ అన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ హత్యకేసును కొనసాగించడం వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తాయనే కారణంతో- అది తేలకముందే ముందస్తుకు వెళ్లే అవకాశం లేకపోలేదని రఘురామ విశ్లేషించారు. ఇవ్వాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి వ్యతిరేకమేనని తాను భావిస్తున్నానని చెప్పారు.
కోడికత్తికి ఇద్దరు మృతిపైనా..
కోడికత్తి తగిలిన ఇద్దరు మరణించినట్లు వచ్చిన వార్తలను పట్టుకుని దాని తీవ్రత గురించి ప్రచారం చేస్తోన్నారని రఘురామ వ్యాఖ్యానించారు. కోడికత్తి శీనుకు ఇప్పటివరకు బెయిల్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ కేసులో ఆయన ఇప్పటివరకు విచారణ కోసం న్యాయస్థానానికి హాజరు కావాలని డిమాండ్ చేశారు. వివేకా హత్యకేసులో తమ ప్రమేయం లేదని వైసీపీ నాయకులు నిరూపించుకోగలిగితే మైలేజీ వస్తుందని పేర్కొన్నారాయన.