జగన్ అనుమతిస్తే అందులో పాల్గొంటా -రఘురామ కోరిక - మన్నిస్తారా ?
ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే నిత్యం యుద్ధం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కొంతకాలంగా తన దూకుడు తగ్గించారు. జగన్, సాయిరెడ్డి బెయిళ్ల రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టుకెక్కి ఎదురుదెబ్బలు తిన్న తర్వాత రఘురామ వ్యాఖ్యల పదును తగ్గింది. అదే సమయంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత కూడా బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో అడపాదడపా మీడియా ముందుకు వస్తున్న రఘురామ.. నిత్యం లైమ్ లైట్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదే క్రమంలో తాజాగా ఇవాళ మరోసారి మీడియా ముందుకొచ్చిన రెబెల్ ఎంపీ రఘురామరాజు.. ప్రభుత్వానికి తమ మనసులో కోరికను చెప్పారు. అమరావతి రైతులు రాజధాని కోసం చేస్తున్న మహా పాదయాత్రకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని తప్పుబట్టారు. అదే సమయంలో జగన్ సర్కార్ అనుమతిస్తే అమరావతి పాదయాత్రలో పాల్గొంటానని రఘరామ స్పష్టం చేశారు. తద్వారా అమరాతి పాదయాత్రలో పాల్గొనేందుకు రఘురామ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాదయాత్ర త్వరలో తిరుమలలో ముగియనుంది. ఈ సందర్భంగా బహిరంగసభకు సైతం రైతులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఏడాదిన్నర క్రితం వైసీపీ సర్కార్ తో విభేదాల నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిపోయిన రఘురామరాజు. అనంతరం సర్జరీ కోసం హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత వైసీపీ సర్కార్ ఆయన్ను ఏపీ పోలీసుల్ని పంపి అరెస్టు చేసి గుంటూరు తెచ్చింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేసి సీఐడీ అరెస్టు చేసింది. ఆ సమయంలో సీఐడీ తనపై దాడి చేసిందని ఆరోపిస్తూ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఢిల్లీ వెళ్లిపోయిన రఘురామ తిరిగి రాలేదు. ఇప్పుడు అమరావతి పాదయాత్రలో పాల్గొనేందుకు వైసీపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే రఘురామ కోరికను జగన్ మన్నించే అవకాశాలు దాదాపుగా ఉండకపోవచ్చు. ఇప్పటికే రఘురామ టీడీపీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఆరోపిస్తున్న వైసీపీ. ఆయనకు అనుమతి ఇవ్వకపోవచ్చు.