లోక్ సభలో రఘురామ వర్సెస్ వైసీపీ ఎంపీలు-వారించిన స్పీకర్-ముఖానికి చేయి అడ్డుపెట్టుకుని..
ఏపీలో వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగుతున్న పోరు ఇవాళ పార్లమెంటులోనూ ప్రతిబింబించింది. జగన్ సర్కార్ చేస్తున్న భారీ అప్పులపై ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న రఘురామరాజు..ఇవాళ లోక్ సభలోనూ ఆ విషయాన్ని లేవనెత్తారు. దీంతో వైసీపీ ఎంపీలు ఆయన్ను అడ్డుకున్నారు.
ఏపీలో కార్పోరేషన్ల పేరుతో వైసీపీ సర్కార్ తీసుకుంటున్న రుణాల వ్యవహారాన్ని ఎంపీ రఘురామరాజు ఇవాళ లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. జగన్ సర్కార్ కార్పోరేషన్ల పేరుతో రుణాలు తీసుకోవడంతో పాటు ఆ నిధుల్ని కూడా ఇతరత్రా అవసరాల కోసం మళ్లిస్తోందని రఘురామ ఆరోపించారు. తాజాగా ఏపీ బేవరెజేస్ కార్పోరేషన్ పేరుతో అప్పులు తీసుకోవడం, వాటిని మూలనిధికి జమ చేయకపోవడాన్ని రఘురామ తప్పుబట్టారు. దీంతో వైసీపీ ఎంపీలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
లోక్ సభలో రఘురామ ప్రసంగం మొదలుకాగాన వైసీపీ ఎంపీలు మార్గాని భరత్ , వంగ గీతతో పాటు పలువురు ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ స్ధానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ వారిని వారించారు. అయినా వారు వినిపించుకోలేదు అదే సమయంలో రఘురామ కూడా వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో సభాధ్యక్ష స్ధానాన్ని ఉద్దేశించి మాట్లాడాలని రఘురామకు సూచించారు. దీంతో ఆయన తన అరచేతిని అడ్డుపెట్టుకుని మరీ మాట్లాడారు. తాను స్పీకర్ ను ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నట్లు చెప్పారు.
వైసీపీ ఎంపీలు తన ఆరోపణలు నిరాధారమని చేస్తున్న విమర్శలపై స్పందించిన రఘురామ.. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని స్పీకర్ కు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కార్పోరేషన్ల పేరుతో రుణాలు తీసుకునేందుకు ప్రత్యేక జీవోను కూడా తెచ్చిందని అన్నారు. దీంతో మరోసారి వైసీపీ ఎంపీలు అడ్డుతగలగా..వారిని సిట్ డౌన్ అంటూ రఘురామ అరిచారు. ఈ తరుణంలో తమను కూర్చోమని చెప్పడానికి రఘురామ ఎవరంటూ వైసీపీ ఎంపీలు వివాదానికి దిగారు.చివరకు రఘురామ తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పి కూర్చుకున్నారు.