మోడీ వైజాగ్ టూర్ కు వైసీపీ భారీ ప్లాన్ ? విపక్షాల గైర్హాజరు వేళ ! రాజధాని సత్తా చాటేలా !
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి విపక్షాలకు మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధానికి విశాఖ మరోసారి కేంద్ర బిందువు కాబోతోంది. రేపు, ఎల్లుండి విశాఖలో జరిగే ప్రధాని మోడీ పర్యటనను ఇందుకు వాడుకోవాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముందుగానే ఇది అధికారిక పర్యటన అని, రాజకీయం చేయొద్దంటూ విపక్షాలకు వార్నింగ్ ఇచ్చేసింది. ఇప్పుడు చివరి నిమిషంలో ఎదురవుతున్న ట్విస్టులు కాస్త ఆందోళన కలిగిస్తున్నా అంతిమంగా ఈ టూర్ ను తమకు అనుకూలంగా వాడుకునేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
మోడీ వైజాగ్ టూర్
ప్రధాని మోడీ రేపు సాయంత్రం విశాఖ రాబోతున్నారు. అనంతరం శోభాయాత్ర పేరుతో రోడ్ షో నిర్వహించి, అది పూర్తయ్యాక విశ్రాంతి తీసుకుని ఎల్లుండి విశాఖలో భారీ బహిరంగసభ నిర్వహణకు సిద్దమవుతున్నారు. దీనికి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో బీజేపీ విపక్ష పార్టీ అయినా కేంద్రంలో అధికారంలో ఉండటం, ప్రధాని మోడీతో సన్నిహిత సంబంధాలు నెరపాల్సిన పరిస్దితి వైసీపీకి ఈ పరిస్దితి కల్పిస్తోంది. దీంతో మోడీ టూర్ ను విజయవంతం చేయడం ఇప్పుడు వైసీపీకి తప్పనిసరిగా మారింది.
విపక్షాల గైర్హాజరీని వాడుకుంటూ..
ప్రధాని మోడీ విశాఖ టూర్ పూర్తి అధికారిక కార్యక్రమమే. అంటే ప్రోటోకాల్ లేనిదే ఈ టూర్ లో ఎవరూ పాల్గొనేందుకు అవకాశం ఉండదు. ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విపక్షాలకు మరోసారి గుర్తుచేశారు. కాబట్టి దీనిపై రాజకీయాలు చేయొద్దంటూ ముందుగానే విపక్షాలకు బంధం వేసేశారు. దీనికి తగినట్లుగానే మోడీ విశాఖ టూర్ పై విపక్షాల్లో సైతం పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. మోడీ టూర్ తో ఏదో జరుగుతుందన్న భ్రమల్లో కూడా విపక్షాలు లేవు. దీంతో ఈ అధికారిక పర్యటనలో విపక్షాల గైర్హాజరీని పూర్తిగా వాడుకునేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోంది.
భారీ ఎత్తున జనసమీకరణ ప్లాన్
ఎల్లుండి ప్రధాని మోడీ విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. ఇక్కడి నుంచే వర్చువల్ విధానంలో పలు కీలక ప్రాజెక్టులకు శంఖుస్ధాపన చేయబోతున్నారు.దీంతో ఈ సభకు రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది వరకూ జనసమీకరణ చేయాలని వైసీపీ భావిస్తోంది. అయితే ప్రధాని మోడీ సభ పెడుతున్ మైదానం సామర్ధ్యం మాత్రం 1.3 లక్షలే. దీంతో ఎదురుగా ఉన్న మరో గ్రౌండ్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని ప్రతీ నియోజకవర్గం నుంచి భారీగా ఇక్కడికి జనాన్ని తరలించాలని సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం ఇన్ ఛార్జ్ లను కూడా నియమించింది. వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. భారీ ఎత్తున జనసమీకరణతో ప్రధానిని ప్రసన్నం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వైజాగ్ రాజధాని సత్తా చాటేలా ?
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేసిన వైజాగ్ సత్తా చాటేలా ప్రధాని మోడీ సభను నిర్వహించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలోని ప్రతీ నియోజకవర్గం నుంచి భారీ జనసమీకరణ చేపట్టడం ద్వారా ప్రధాని సభను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా విశాఖ రాజధానిలో ప్రధాని సభను ఇక్కడి ప్రజలు విజయవంతం చేశారు కాబట్టి ఇక్కడ రాజధాని పెట్టాలన్న తమ నిర్ణయానికి ప్రధానితో ఆమోదముద్ర వేయించాలనేది జగన్ ప్లాన్ గా కనిపిస్తోంది. అయితే బీజేపీ నేతలు మాత్రం ప్రధాని టూర్ లో రాజధాని ప్రస్తావన ఉండబోదని చెప్తున్నారు. అయినా విశాఖలో సత్తా చాటుకోవడం ద్వారా విశాఖ రాజధాని ప్రధాని దృష్టిని ఆకర్షించేలా వైసీపీ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.