ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా ? వైసీపీ డిఫెన్స్లో ఎందుకు పడుతోంది ? టీడీపీ దూకుడు వెనుక ?
ఏపీ ఫోన్ ట్యాపింగ్ వివాదం కేంద్రంగా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ పరస్పరం పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు జరిగిందో లేదో కూడా తెలియని ఫోన్ ట్యాపింగ్పై టీడీపీ రచ్చరచ్చ చేస్తుంటే అధికారంలో ఉండి కచ్చితంగా లేదని చెప్పలేక వైసీపీ ఆపసోపాలు పడుతోంది. టీడీపీ ట్రాప్లో పడటం ఎందుకని వైసీపీ పాటిస్తున్న వ్యూహాత్మక మౌనం ఇప్పుడు ఆ పార్టీని కార్నర్ అయ్యేలా చేస్తుండగా.. టీడీపీ దాన్ని సొమ్ము చేసుకుంటూ మరింత దాడి చేసేందుకు సిద్దమవుతోంది. ఈ వివాదంలో టీడీపీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు కూడా ఏమీ చేయలేక చేష్టలుడిగి చూడాల్సిన పరిస్ధితి.

ఏపీ ఫోన్ ట్యాపింగ్...
ఏపీకి ఫోన్ ట్యాపింగ్ కొత్త కాదు. పలు సందర్భాల్లో రాష్ట్రంలో రాజకీయ నేతల మధ్య ట్యాపింగ్ ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. అప్పటికీ ఇప్పటికీ ఏమీ తేడా లేదు. గతంలోనూ కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో ట్యాపింగ్ ఆరోపణలు వచ్చేవి, కొంతకాలానికి అవి సమసి పోయేవి. అప్పుడంటే అంత టెక్నాలజీ లేదనో, కేంద్రం పాత్ర పేరుతోనే ప్రభుత్వాలు అంత కార్నర్ కాకుండా తప్పించుకునేవి. కానీ ఇప్పుడు పరిస్ధితి వేరు. ట్యాపింగ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయంటే అది అసాధ్యం అని ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. దీంతో అధికార పక్షాలు కూడా దీన్ని వెంటనే ఖండించడమో, లేక పూర్తిగా మౌనంగా ఉండిపోవడమో చేయలేని పరిస్ధితి ఉంది.
అలాగని అస్సలు మాట్లడకపోతే ఫోన్ ట్యాపింగ్ చేసే ఉంటారనే విమర్శలూ తప్పవు.

అసలు ట్యాపింగ్ జరిగిందా ?
ఏపీలో టీడీపీ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు మూలం ఆ పార్టీ హయాంలో కొనుగోలు చేసిన నిఘా పరికరాలే. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అప్పటి ఇంటిలిజెన్స్ ఛీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుతో తెప్పించిన ఈ పరికరాలను ఉపయోగించి ఇప్పుడు జగన్ సర్కారు ట్యాపింగ్ కు పాల్పడుతోందనేది టీడీపీ ఆరోపణ. అంటే అప్పట్లో తాము తెప్పించిన పరికరాలతో ఏమేం చేయొచ్చో తమకున్న అవగాహనతోనే టీడీపీ ఈ విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో తమపై నిఘా పెట్టేందుకు ఈ పరికరాలు తెప్పించారని ఆరోపణలు చేసిన వైసీపీ... తాము అధికారంలోకి రాగానే ఇదే కారణంతో అప్పటి ఇంటిలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ కూడా చేసింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆరోపణలు నిజమేనేమో అని జనం కూడా అనుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.

శూన్యంలో వైసీపీ, టీడీపీ పోరు...
అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో ఎవరికీ తెలియదు, హైకోర్టు మొబైల్ సర్వీసు ప్రొవైడర్లను ట్యాపింగ్ జరిగితే వివరాలు ఇవ్వాలని కోరింది. కానీ వారు ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు. కనీసం ట్యాపింగ్ జరిగింది వివరాలు ఇస్తామని కూడా చెప్పడం లేదు. అలాగని హైకోర్టు నోటీసు ఇచ్చిన మేరకు ట్యాపింగ్ జరిగితే వాటి వివరాలు ఇచ్చేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అసలు ఈ ట్యాపింగ్ వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోదంటూ ఓవైపు బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు. ఇక ట్యాపింగ్కు సంబంధించి నిర్దిష్ట ఆధారాలు ఎక్కడ ఉన్నాయని అడిగితే చెప్పే వారే లేరు. కానీ నిత్యం వైసీపీ సర్కారుపై టీడీపీ చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే పక్కాగా సాగుతున్న మైండ్ గేమ్ అర్ధమైపోతోంది. దీనికి సరైన సమాధానం వెతుక్కోలేక అధికార వైసీపీ కూడా దిక్కులు చూస్తోంది. నామమాత్రంగా కౌంటర్లు ఇచ్చేందుకు మాత్రమే ప్రయత్నాలు చేస్తోంది. అంటే ఓ విధంగా చేయాలంటే ఏమీ లేని శూన్యంలో వైసీపీ, టీడీపీ పోరు సాగుతోందన్నమాట.

టీడీపీ మైండ్ గేమ్ ఇందుకేనా ?
రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ అటు వరుస సంక్షేమ పథకాలు, ఇటు ప్రత్యర్ధులపై ముప్పేట దాడితో ముందుకెళుతోంది. ఇందులో విపక్షాలపై దాడుల విషయంలో మాత్రమే టీడీపీ కౌంటర్ చేయగలుగుతోంది. కానీ సంక్షేమ పథకాలను తప్పుబట్టే అవకాశం లేదు. దీంతో ఓ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా ప్రజల దృష్టి మళ్లించేందుకు టీడీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. దీంతో ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారం తెరపైకి వచ్చింది. అటు వైసీపీ ఖండించలేని, ఇటు టీడీపీ ఎంత వరకైనా ముందుకెళ్లగల ఈ మైండ్ గేమ్ ద్వారా పసుపు పార్టీ ఏం సాధించబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. అయితే వైసీపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చక్కగా ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications