ఇక...యూత్ ఆంధ్ర కూడా...ప్రతి జిల్లాలో యువ భవన్...మూడు క్రీడా కేంద్రాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ యువతలో దేశ భక్తి రగిలించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అందుకోసం ప్రతి జిల్లాలో ఒక యువ భవన్ నిర్మించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఎపిలో మూడు నగరాలను క్రీడా కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సీఎం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి జిల్లాలో యువ భవనం నిర్మించి యువజన విధానం తీసుకొస్తామని, వివేకానందుడి స్ఫూర్తిగా పట్టుదల, క్రమశిక్షణ, దేశభక్తి రగిలించేలా యువతకు అక్కడ శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోయి అచేతనంగా ఉన్న జాతిలో ఆత్మస్థైర్మం నింపిన మహోన్నత వ్యక్తి వివేకానందుడని కొనియాడారు. మానవత్వమే తమ హితమన్న భారతీయతత్వాన్ని హైందవ ధర్మాలను ప్రపంచానికి చాటిచెప్పారన్నారు. పరిజ్ఞానం, నైపుణ్యాలు కలిగిన యువత మీదనే దేశభవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు.
రాజధాని అమరావతితోపాటు విశాఖ, తిరుపతి నగరాలను అంతర్జాతీయ క్రీడా కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. ఈ క్రీడా నగరాల్లో జాతీయ, అంతర్జాతీయ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. గుంటూరు భాష్యం విద్యాసంస్థల వద్ద జరిగిన సెంట్రల్ జోన్ క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ జిల్లాల్లోని పాత క్రీడా ప్రాంగణాలను పీపీపీ విధానంలో ఆధునికీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.